Lalu on Modi Govt | కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వంపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నిప్పులు చెరిగారు. ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్ కేసులో తనతోనాటు తన భార్య రబ్రీ దేవి, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తదితరులపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసిన రెండు రోజుల తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ బుధవారం స్పందించారు. రైల్వేశాఖ మంత్రిగా అవినీతికి పాల్పడ్డారని లాలూ ప్రసాద్ యాదవ్పై ఆరోపణలు ఉన్నాయి. ఆర్జేడీ 27వ వార్షికోత్సవ వేడుకల ప్రారంభోత్సవంలో లాలూ మాట్లాడుతూ ఒక కేసు తర్వాత మరొక కేసు తనపైనా, తన కుటుంబ సభ్యులపై పెడుతున్నారన్నారు.
బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల్లో ఐక్యత తేవడానికి బీహార్ సీఎం నితీశ్ కుమార్ చేస్తున్న ప్రయత్నాలను లాలూ ప్రసాద్ యాదవ్ ప్రశంసించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయం అని అంచనా వేశారు. `ముందుగా జరిగే పరిణామాలను కర్ణాటక తెలియచెప్పింది` అని లాలూ చెప్పారు. దక్షిణాది రాష్ట్రంలో బీజేపీ అధికారానికి దూరమైందని, ఇప్పటికీ బీజేపీ బేరసారాలకు పాల్పడుతుందని పరోక్షంగా మహారాష్ట్ర పరిణామాలను గుర్తు చేశారు.
`విపక్షాల మధ్య ఐక్యతకు బీహార్లో మహాఘట్బంధన్ మంచి ఉదాహరణ. అంబేద్కర్ వారసత్వంగా వచ్చిన రిజర్వేషన్లను తొలగించడానికి ప్రయత్నిస్తున్న మతతత్వానికి వ్యతిరేకంగా మనమంతా ధృడంగా పోరాడాల్సిన అవసరం ఉంది` అని లాలూ పేర్కొన్నారు. 2004-09 మధ్య కాలంలో రైల్వేశాఖ మంత్రిగా లాలూ పని చేసినప్పుడు మధ్యప్రదేశ్లోని జబల్పూర్ ప్రాంతంలో గ్రూప్-డీ ఉద్యోగ నియామకాల్లో అవినీతికి పాల్పడ్డారని సీబీఐ అభియోగం. ఉద్యోగాలు పొందిన వారి నుంచి లాలూ కుటుంబం, సన్నిహితులు భూమి గిఫ్ట్గా పొందారని ఆరోపణలు ఉన్నాయి.