న్యూఢిల్లీ : డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్భూషణ్ సింగ్కు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు చేపట్టిన ఆందోళనపై పోలీసులు బలప్రయోగం చేయడం కలకలం రేపుతోంది. ఢిల్లీ పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న అనంతరం ఈ ఉదంతంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. భరతమాత బిడ్డలపై మోదీ సర్కార్ వేధింపులకు పాల్పడుతోందని దుయ్యబట్టారు.
దేశ క్రీడాకారుల పట్ల ఇలాంటి ప్రవర్తన సిగ్గుచేటని, బేటీ బచావో నినాదం బూటకమని తేలిపోయిందని రాహుల్ దుయ్యబట్టారు. దేశానికి ఎన్నో పతకాలు, కీర్తిని తీసుకువచ్చిన మహిళా క్రీడాకారిణులు కన్నీరు కార్చేలా చేయడం బాధాకరమని అన్నారు. క్రీడాకారిణులు, వారి కుటుంబ సభ్యులు త్యాగాలతో, అంకితభావంతో దేశానికి సేవలు అందిస్తారని పేర్కొన్నారు. వారి ఆందోళనను సానుభూతితో అర్ధం చేసుకుని సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని రాహుల్ సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు.
దేశంలో చాంపియన్ ప్లేయర్ల పట్ల పోలీసుల తీరును ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. ఇది అత్యంత బాధాకరం, సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. వ్యవస్ధలన్నింటినీ తమ కనుసన్నల్లో నడిపించాలని కాషాయ పాలకులు భావిస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీని అధికారం నుంచి తప్పించాలని ప్రజలకు ఆయన పిలుపు ఇచ్చారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మహిళా క్రీడాకారులకు బాసటగా నిలిచారు. మనమంతా మనుషులుగా మన రెజ్లర్లకు అండగా నిలవాలని అన్నారు. ఈ రకంగా మన పిల్లల గౌరవానికి కేంద్ర ప్రభుత్వం భంగకరంగా వ్యవహరించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
Read More