న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును (Womens Reservation Bill) ప్రవేశపెట్టింది. ఈ బిల్లును న్యాయమంత్రి అర్జున్ మేఘ్వాల్ (Arjun Ram Meghwal) సభ్యుల ముందు ఉంచారు. ఈ బిల్లుకు ‘నారీ శక్తి వందన్’గా నామకరణం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళా రిజర్వేన్ల అమలు ఉంటుందని వెల్లడించారు. ఈ బిల్లుపై రేపు లోక్సభలో చర్చ జరగనుంది. ఈ బిల్లుపై ఎగువ సభలో గురువారం చర్చ జరగనుంది.
ఇక మహిళా రిజర్వేషన్ బిల్లుపై స్పందించేందుకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిరాకరించారు. మహిళా బిల్లును మీరు సమర్ధిస్తారా అని పార్లమెంట్ భవనం వెలుపల విలేకరులు రాహుల్ను ప్రశ్నించగా సరైన సమయం రాకుండా తాను దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనని వ్యాఖ్యానించారు. ఇక అంతకుముందు మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేయడంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) స్పందించారు.
అన్ని రాజకీయ పార్టీలు బిల్లుకు మద్దతిస్తుండగా మహిళా బిల్లును ప్రవేశపెట్టడానికి మోదీజీ పదేండ్లు ఎందుకు వేచిచూశారు అని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ట్విట్టర్లో ప్రశ్నించారు. మహిళా బిల్లుకు మోదీ సర్కార్ మోక్షం కల్పించడం నిజమైతే 2024 సార్వత్రిక ఎన్నికల కోసమే ఈ బిల్లును ప్రవేశపెడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఓబీసీ మహిళలకు ప్రభుత్వం కోటా కల్పించని పక్షంలో రానున్న సాధారణ ఎన్నికల్లో యూపీలో బీజేపీకి భంగపాటు తప్పదని కపిల్ సిబల్ హెచ్చరించారు.
Read More :
Photo Session | పార్లమెంట్ భవనం వద్ద ఎంపీల ఫొటో సెషన్