Rahul Gandhi : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై బెంగాల్ కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తనకు అత్యంత సన్నిహితమని రానున్న లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో టీఎంసీతో సీట్ల సర్దుబాటు చర్చలపై అధిర్ రంజన్ చేసిన వ్యాఖ్యలను పట్టించుకోబోమని పేర్కొన్నారు. మేఘాలయాలో భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో సీట్ల సర్ధుబాటుపై టీఎంసీతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని చెప్పారు. కొన్నిసార్లు తమ నేతలు కొన్ని వ్యాఖ్యలు చేస్తుంటారు.
అలాంటి వ్యాఖ్యలు చర్చలపై ప్రభావం చూపవని అన్నారు. దీదీ సహకారం లేకుండానే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సొంతంగా పోటీ చేస్తుందని అధిర్ రంజన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రస్తావించగా రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్ర బెంగాల్, బిహార్ మీదుగా సాగినప్పుడు తాను మమతా బెనర్జీ, నితీష్ కుమార్లను యాత్రలో పాల్గొనాలని తాను ఆహ్వానించానని రాహుల్ గుర్తు చేశారు.
కాగా, పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అవకాశవాదని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురి విరుచుకుపడ్డారు. దీదీ సహకారం లేకుండానే రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయాలని ఆయన అగ్ర నాయకత్వాన్ని కోరారు. తాము మమతా బెనర్జీ సాయం లేకుండానే ఎన్నికల బరిలో దిగుతామని, తాము తమ సొంత బలంతోనే ఎన్నికల బరిలో ఉంటామని అధిర్ రంజన్ స్పష్ఠం చేశారు. కాంగ్రెస్ సాయంతోనే బెంగాల్లో టీఎంసీ అధికారంలోకి వచ్చిందనే విషయం దీదీ గుర్తుంచుకోవాలని అన్నారు. అధిర్ వ్యాఖ్యలతో ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల్లో గందరగోళం నెలకొంది. అధిర్ గతంలోనూ పలుమార్లు మమతా బెనర్జీపై విమర్శలతో విరుచుకుపడ్డారు.
Read More :