న్యూఢిల్లీ : అహంభావంతో కండ్లు మూసుకుపోయిన బీజేపీ ప్రభుత్వానికి దేశంలో ఎగబాకిన ద్రవ్యోల్బణం కనిపించడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం మోదీ సర్కార్పై విరుచుకుపడ్డారు. దేశ ఆస్తులను మోదీ ప్రభుత్వం తమ సంపన్న స్నేహితులకు దోచిపెడుతోందని దుయ్యబట్టారు.
లోక్సభలో ధరల పెరుగుదలపై చర్చ అనంతరం రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ ఆర్ధిక మాంద్యంలోకి పడిపోయే ప్రసక్తే లేదని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బదులిచ్చిన క్రమంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో ద్రవ్యోల్బణం లేదని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో చెబుతోందని, కాషాయ పాలకుల కండ్లు అహంభావంతో మూసుకుపోవడంతో వారికి ధరల పెరుగుదల ఎక్కడ కనిపిస్తుందని కాంగ్రెస్ ఎంపీ ట్వీట్ చేశారు.
2019 నుంచి ఇప్పటికి పెట్రోల్, డీజిల్ సహా నిత్యావసర ధరలు మంటెక్కిన తీరును ఈ పోస్ట్లో వివరించారు. అహంభావ ధోరణితో కూడిన రాజు ప్రతిష్టను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం వేలాది కోట్లు వెచ్చిస్తోందని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు.