న్యూఢిల్లీ : అగ్నిపధ్ రిక్రూట్మెంట్ పధకం ద్వారా పెద్దసంఖ్యలో యువతను సైనిక బలగాల్లోకి రప్పించే కార్యక్రమానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేయడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. అగ్నిపధ్ నియామకాలతో మన సాయుధబలగాల నిర్వహణ సామర్ధ్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. మన గౌరవం, సంప్రదాయాలు, సైనిక పాటవం, సేనల క్రమశిక్షణ విషయంలో రాజీపడే ధోరణిని బీజేపీ ప్రభుత్వం విరమించాలని రాహుల్ బుధవారం ట్వీట్ చేశారు.
ఇక అంతకుముందు సీపీఎం నేత సీతారాం ఏచూరి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రొఫెషనల్ ఆర్మీని దీటుగా పెంపొందించేందుకు బదులు పెన్షన్ సొమ్మును ఆదా చేసేందుకు మోదీ ప్రభుత్వం కాంట్రాక్టుపై సైనికుల నియామకాలను చేపడుతోందని ఏచూరి ఎద్దేవా చేశారు. ఇలాంటి దేశ వ్యతిరేక పధకాన్ని నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు రిటైర్డ్ సైనికోద్యోగులు కూడా అగ్నిపధ్పై భిన్నాబిప్రాయాలు వ్యక్తం చేశారు.
భారత సైన్యం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదని, అగ్నిపధ్ పధకం కింద యువతను మూడు నాలుగేండ్ల కోసం సైన్యంలో రిక్రూట్ చేయడం సరైంది కాదని మేజర్ జనరల్ (రిటైర్డ్) పీకే సైఘల్ అభిప్రాయపడ్డారు. ఓ వ్యక్తి పూర్తిస్దాయి సైనికుడిగా ఎదిగేందుకు ఆరు నుంచి ఏడేండ్లు పడుతుందని, అయితే అంతకుముందే ఈ యువత ఉద్యోగాల నుంచి బయటకు వస్తారని అన్నారు. అయితే బహుముఖ సవాళ్లను ఎదుర్కొనేందుకు అగ్నిపధ్ పధకం సైన్యాన్ని భవిష్యత్ పోరాట వ్యూహాలకు పదును పెడుతుందని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే చెబుతున్నారు.