కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లండన్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తమ గొంతు నొక్కుతోందని మండిపడ్డారు. గతంలో ఎలాగ భారత దేశం వుండేదో.. ఆ దేశం కోసం తాము ప్రయత్నాలు చేస్తున్నామని, అందుకే తమ గొంతు నొక్కుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. లండన్ కేంబ్రిడ్జి యూనివర్శిటీలో జరుగుతున్న ఐడియాస్ ఆఫ్ ఇండియా అన్న కార్యక్రమంలో రాహుల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడారు. దేశ ప్రజానిక గొంతును కేంద్రం నొక్కాలని చూస్తోందని ఆరోపించారు. తాము మాత్రం ప్రజా గొంతుకను వినడానికే ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. దేశ గత వైభవం కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, ఈ సందర్భంగానే బీజేపీకి, కాంగ్రెస్కు మధ్య సైద్ధాంతిక యుద్ధం నడుస్తోందని అభివర్ణించారు. బీజేపీ, ఆరెస్సెస్ భారత్ను కేవలం ఓ భూభాగంగానే చూస్తాయని, తాము మాత్రం దేశాన్ని ప్రజల రూపంలో కొలుస్తామని చెప్పుకొచ్చారు.
మోదీ పాలనలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని, అందుకే ఓట్ల కేంద్రీకరణ వైపు బీజేపీ దృష్టి సారిస్తోందని రాహుల్ అన్నారు. భారత దేశ పరిస్థితి ఏమాత్రం బాగోలేదని విమర్శించారు. భారత్ భిన్న భిన్న వాదనలను లేవనెత్తే ప్రదేశంగా తాము చూస్తామని, కానీ.. బీజేపీ గొంతు నొక్కుతోందన్నారు. తాము మాత్రం ప్రజా గొంతుకను వినడానికి సిద్ధంగా ఉన్నామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.