Rahul Gandhi | రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పంజాబ్లోకి చేరుకున్నది. యాత్ర షెడ్యూల్లో మార్పులు చేయడంతో అనుకున్న సమయం కన్నా ముందే ఆయన అమృత్సర్ చేరుకున్నారు. స్వర్ణ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కాషాయ రంగు తలపాగా ధరించిన రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఆపరేషన్ బ్లూస్టార్ తర్వాత తొలిసారి గాంధీ కుటుంబం వ్యక్తి ఒకరు గోల్డెన్ టెంపుల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు అమృత్సర్ విమానాశ్రయంలో దిగిన రాహుల్గాంధీ.. ఇక్కడి నుంచి నేరుగా హోటల్ రాడిసన్ బ్లూ చేరుకున్నారు. అక్కడి నుంచి రాహుల్ గాంధీ కాన్వాయ్ బయలుదేరి స్వర్ణ దేవాలయానికి చేరుకున్నది. గోల్డెన్ టెంపుల్ విశిష్టతను రాహుల్ గాంధీకి ప్రతాప్ సింగ్ బజ్వా వివరించారు. అలా నడుస్తుండగా ఓ కెమెరామెన్ ఒక్కసారిగా పడిపోయాడు. దాంతో ఒక్క ఉదుటన రాహుల్ గాంధీ పరిగెత్తుకుంటూ వచ్చి ఆయనను లేపారు. అనంతరం స్వర్ణ దేవాలయంలోకి వెళ్లి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. తల వంచుకుని కొంత సేపు కీర్తనలు వింటూ గడిపాడు. ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత గాంధీ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి స్వర్ణ దేవాలయంలోకి రావడం ఇదే తొలిసారి. దాదాపు 20 నిమిషాల పాటు కీర్తనలు వింటూ రాహుల్ కూర్చున్నారు.
రాహుల్ గాంధీకి మూడంచెల భద్రత ఉన్నప్పటికీ.. ఎస్జీపీసీ సభ్యుడు లేదా భద్రతా సిబ్బంది ఎవరూ ఆయన వెంట స్వర్ణ దేవాలయంలోకి రాలేదు. రాహుల్ గాంధీని లోనికి తీసుకెళ్లేందుకు కొంత సమయంపాటు క్యూను నిలిపివేశారు. అయితే, గోల్డెన్ టెంపుల్ లోపల మాత్రం రాహుల్ సామాన్య వ్యక్తిలా తల వంచుకుని నిల్చున్నాడు. బ్లూ స్టార్ ఆపరేషన్ అనంతరం గాంధీ కుటుంబంలోని ఏ వ్యక్తికి ఇప్పటివరకు వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వలేదు. ఇలాఉండగా, పంజాబ్లో రాహుల్ గాంధీ 10 రోజులపాటు 350 కిలోమీటర్లు నడవనున్నారు. భద్రతా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో కారులో సగం యాత్ర చేపట్టనున్నారు.