అహ్మదాబాద్ : ఈ ఏడాది చివరిలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్నికాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని సంపన్నులు, పేదలు అంటూ రెండు భారత్లుగా సృష్టించారని మండిపడ్డారు. దేశంలో కీలక వనరులను కొద్దిమంది సంపన్నులకు దోచిపెడుతున్నారని దుయ్యబట్టారు.
దహోద్ జిల్లాలో ఆదివాసీ సత్యాగ్రహ ర్యాలీని ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ మోదీ సర్కార్పై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2014లో మోదీ దేశ ప్రధాని పగ్గాలు చేపట్టకముందు గుజరాత్ సీఎంగా ఉన్నారని, గుజరాత్లో ఆయన చేసిన పనులే ఇప్పుడు దేశంలో చేస్తున్నారని దీన్ని గుజరాత్ మోడల్గా చెబుతున్నారని ఎద్దేవా చేశారు. మోదీ సంపన్నులు, పేదల కోసం సృష్టించే రెండు భారత్లను కాంగ్రెస్ పార్టీ కోరుకోవడం లేదని అన్నారు.
గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం గిరిజనుల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. కాషాయ సర్కార్ మీకు ఎలాంటి మేలు చేయకుండా మీ వనరులను లాగేసుకుంటోందని ఆరోపించారు. గిరిజనులు తమ హక్కులను సాధించుకుంటేనే వారికి రావాల్సిన వాటా దక్కుతుందని అన్నారు. గిరిజనుల కష్టంతో గుజరాత్లో రోడ్లు, బ్రిడ్జిలు, భవనాలు, మౌలిక వసతులు సమకూరినా వారు తిరిగి పొందింది ఏమీ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజనులకు విద్య, వైద్యం అందుబాటులో లేదని ఆరోపించారు.