లక్నో : ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతున్నది. అధికార బీజేపీ, కాంగ్రెస్ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఫేక్ గాంధీ అని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్లో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహాత్మా గాంధీ కలలను బీజేపీ నేతృత్వంలోని సాకారం చేస్తుందన్నారు.
మహాత్ముడి కలలను సాకారం చేసేందుకు బీజేపీ, యోగి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. 403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో ఏడు విడుతల్లో ఎన్నికలో జరుగనున్నాయి. ఫిబ్రవరి 10న పోలింగ్ జరుగనున్నది. రెండో విడుత ఫిబ్రవరి 14న, 20న మూడు, 23న నాల్గో విడుత, 27న ఐదో విడుత పోలింగ్ జరుగనున్నది. మార్చి 3, 7 తేదీల్లో ఆరు, ఏడో విడుద పోలింగ్ జరుగనున్నది. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
ఇదిలా ఉండగా.. ఇవాళ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా రాహుల్ గాంధీ ఆయనకు నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీని ఓ హిందుత్వ వాది చంపేశాడని పేర్కొన్నారు. హిందుత్వవాదులు అందరూ ఆయన ఇక లేరని విర్రవీగుతున్నారని, కానీ, సత్యం ఎక్కడైతో ఉంటుందో అక్కడ ఆయన ఎప్పటికీ సజీవంగా ఉంటారని ట్వీట్ చేశారు. మహాత్మా గాంధీని 1948లో ఇదే రోజున నాథురాం గాడ్సే తుపాకీతో కాల్చి చంపాడు. జాతి పిత మహాత్మా గాంధీ వర్ధంతినే మార్టిర్స్ డేగా దేశం పాటిస్తున్నది. రాహుల్ గాంధీ రాజ్ఘాట్లో మహాత్మా గాంధీ సమాధికి నివాళులు అర్పించారు.