ముంబై, ఏప్రిల్ 23: గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానం ఏకగ్రీవంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే కీలక వ్యాఖ్యలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారితో తమ పార్టీనే సంప్రదింపులు జరిపి, నామినేషన్లు విత్డ్రా చేసుకునేలా చేసిందని వెల్లడించారు.
మంగళవారం ముంబైలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ రాజకీయంగా దిగజారిందన్న విమర్శలపై ఆయన స్పందిస్తూ.. ‘స్వతంత్ర అభ్యర్థులను నామినేషన్లు ఉపసంహరించుకోవాలని అభ్యర్థించాం. వారు ఉపసంహరించుకున్నారు. ఇందులో దిగజారిపోవడం ఏముంది?’ అని ఆయన ఎదురు ప్రశ్నించారు. ఇతర అభ్యర్థులనూ బీజేపీ సంప్రదించిందా అని ప్రశ్నించగా.. అవునని ఆయన పేర్కొన్నారు.