Rahul Gandhi | బీజేపీ సభ్యుల నోటీసుపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్సభ సెక్రటేరియట్కు వివరణాత్మక సమాధానం ఇచ్చారు. పార్లమెంట్లో తాను మాట్లాడిన ప్రకటన సరైందే అని ఆయన సమర్ధించుకున్నారు. ఇదే విషయాన్ని సోమవారం నాటి వాయనాడ్ బహిరంగసభలో కూడా రాహుల్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఆయన తన సమాధాన పత్రాన్ని లోక్సభ సచివాలయానికి పంపించారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఫిబ్రవరి 7 న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా.. హిండెన్బర్గ్-అదానీ అంశాన్ని లేవనెత్తి ప్రధాని మోదీపై రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మోదీతో అదానీ ఉన్న ఫొటోను సభలో ప్రదర్శించారు. దీనికి ఎన్డీఏ సభ్యులు తీవ్ర అభ్యంతరపెట్టారు. అనంతరం రాహుల్ వ్యాఖ్యలను స్పీకర్ రికార్డుల నుంచి తొలగించారు. దీనికి సంబంధించి బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కేంద్ర మంత్రి ప్రహ్లాద్జోషికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును కేంద్ర మంత్రి లోక్సభ సెక్రటేరియట్కు పంపించారు. దాంతో లోక్సభ సెక్రటేరియట్ సమాధానం కోరుతూ రాహుల్కు ఈ నెల 10 న నోటిసు పంపింది.
లోక్సభలో తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకునేలా రాహుల్ వివిధ చట్టాలను ఉటంకిస్తూ అనేక పేజీల్లో వివరణాత్మక సమాధానం ఇచ్చారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. సోమవారం వాయనాడ్లో జరిగిన సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ, సభలో చర్చ సందర్భంగా చేసిన పలు వ్యాఖ్యలను తన ప్రసంగం నుంచి తొలగించడాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. పార్లమెంటు కార్యకలాపాల రికార్డుల నుంచి తొలగించిన తన ప్రతి వ్యాఖ్యల గురించి లోక్సభ స్పీకర్కు రాసిన లేఖలో సమాచారం, ఆధారాలు ఇచ్చినట్లు కాంగ్రెస్ నాయకుడొకరు చెప్పారు. తాను మాట్లాడిన మాటలన్నీ సరైనవే అని రాహుల్ సమాధానం ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.