Electoral Bonds : ఎలక్టోరల్ బాండ్లు భారీ వసూళ్ల దందా స్కీమ్గా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అభివర్ణించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం ఈ స్కీమ్ను బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తే దాతల పేర్లను ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికల బాండ్లు నరేంద్ర మోదీ మాస్టర్ స్కీమ్ అని, ఈ పధకం వెనుక ప్రధాన సూత్రధారి ఆయనేనని రాహుల్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఎన్నికల బాండ్ల వివరాలు కోరిన తర్వాత కూడా డేటా విడుదలను అడ్డుకుంటున్నది ఎవరని ప్రశ్నించారు.
ఎన్నికల బాండ్లు దోపిడీయేనని, వీధుల్లో మామూళ్లు వసూలు చేసే అతిపెద్ద వసూళ్ల స్కీమ్ ఇదేనని మండిపడ్డారు. కోజికోడ్లో ఎన్నికల ప్రచారంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల బాండ్లు ఎన్నికల్లో బ్లాక్ మనీని నిరోధించేందుకు ప్రవేశపెట్టారని, దీన్ని విమర్శిస్తున్న విపక్షాలు ఆపై పశ్చాత్తాపడతాయని ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని వ్యాఖ్యానించిన అనంతరం రాహుల్ ఎన్నికల బాండ్ల వ్యవహారంపై స్పందించారు.
ఇక అంతకుముందు కోజికోడ్లో జరిగిన రోడ్షోలోనూ ఎన్నికల బాండ్ల పధకంపై మోదీ లక్ష్యంగా రాహుల్ విమర్శలు గుప్పించారు. అతిపెద్ద అవినీతి కుంభకోణాన్ని ప్రధాని మోదీ సమర్ధించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. భారత పారిశ్రామికవేత్తల నుంచి కోట్ల రూపాయలను ఎన్నికల బాండ్ల రూపంలో బీజేపీ దండుకున్నదని విమర్శించారు. ఎన్నికల బాండ్లు రాజ్యాంగవిరుద్ధమని ఈ ఏడాది ఫిబ్రవరిలో వీటిని సుప్రీంకోర్టు నిలిపివేసింది.
Read More :
Loksabha Elections 2024 | రాహుల్ గాంధీకి దేశంపై అవగాహన లేదు : కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్