న్యూఢిల్లీ : కరోనా కట్టడికి అవసరమైన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్పై ఆడిట్ నివేదిక వెల్లడైన నేపధ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం మోదీ సర్కార్పై విరుచుకుపడ్డారు. ప్రధాని అసత్యాలు చెబుతున్నారని ట్విట్టర్ వేదికగా రాహుల్ మండిపడ్డారు. పీఎం కేర్స్ ఫండ్ వినియోగం, కేంద్ర ప్రభుత్వ తీరుపై రాహుల్ గత కొంత కాలంగా విమర్శలతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే.
కొవిడ్-19 సెకండ్ వేవ్లో పీఎం కేర్స్ ఫండ్ నుంచి వివిధ ఆస్పత్రులకు సరఫరా చేసిన వెంటిలేటర్లు నాసిరకంగా ఉన్నాయని, నిధులను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ఆయన గతంలో ఆరోపించారు. ఇక ఆడిట్ నివేదిక ప్రకారం పీఎం కేర్స్ ఫండ్కు 2020-21లో రూ 10,990 కోట్ల నిధులు సమకూరగా రూ 7183 కోట్ల నిధులు స్వచ్ఛందంగా విరాళాల రూపంలో రాగా, విదేశీ కంట్రిబ్యూటర్ల నుంచి రూ 494 కోట్లు సమకూరాయి.
2020-21లో పీఎం కేర్స్ ఫండ్ నుంచి రూ 3976 కోట్లు ఖర్చు కాగా, దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులకు మేడిన్ ఇండియా వెంటిలేటర్ల సరఫరా కోసం రూ 1311 కోట్లు వెచ్చించారు. ఇక కరోనా మహమ్మారితో ఇబ్బందులు ఎదుర్కొన్న వలస కూలీల సంక్షేమం కోసం రాష్ట్రాలకు రూ 1000 కోట్లు సాయం అందించారని పీఎం కేర్స్ ఫండ్పై ఆడిట్ నివేదిక తెలిపింది.