న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ముందు హాజరవుతున్నారు. ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో అధికారులు నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన ఆర్థిక అవకతవకల వ్యవహారంలో ప్రశ్నలు సంధించనున్నారు. అయితే ఈ నెల 2న రాహుల్ ఈడీ ముందు హాజరవ్వాల్సి ఉన్నది. అయితే అదేసమయంలో ఆయన విదేశీ పర్యటనలో ఉండటంతో నేటికి వాయిదాపడింది. కాగా, ఇదే కేసులో కాంగ్రెస్ అధినేత్రి జూన్ 23న ఈడీ విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నది. కాగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేతోపాటు పవన్ బన్సల్ను ఇదే కేసులో విచారించింది.
కాగా, ఇవాళ దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. రాహుల్ ఈడీ ముందు హాజరయినప్పటి నుంచి ముగిసే వరకు అన్ని రాష్ట్రాల్లోని ఈడీ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించనుంది. రాహుల్ మద్దతుగా పార్టీకి చెందిన అగ్రనాయకుల నుంచి సాధారణ కార్యకర్త వరకు ఈ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించింది.