న్యూఢిల్లీ : బొగ్గు దిగుమతుల పేరుతో అదానీ గ్రూప్ ఇంధన ధరలను పెంచి రూ. 32,000 కోట్ల ప్రజా ధనాన్ని కొల్లగొట్టిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) బుధవారం ఆరోపించారు. పారిశ్రామికవేత్త గౌతం అదానీ ఇండోనేషియా నుంచి బొగ్గు కొనుగోలు చేస్తారని, అది భారత్ చేరేసరికి ధరలు రెట్టింపు అవుతాయని అన్నారు.
భారత్లో పేదల జేబు నుంచి అదానీ రూ. 32,000 కోట్లు కొల్లగొట్టారని రాహుల్ ఆరోపించారు. కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్పై సబ్సిడీ అందిస్తున్నామని, మధ్యప్రదేశ్లోనూ అధికారంలోకి వస్తే ఇలాగే చేస్తామని హామీ ఇచ్చారు. అదానీ మోసగించడంతోనే వినియోగదారుల విద్యుత్ బిల్లులు పెరిగాయని అర్ధం చేసుకోవాలన్నారు.
బొగ్గు ధరలపై అదానీ మాయాజాలం అంటూ బ్రిటిష్ న్యూస్ పేపర్ ఫైనాన్షియల్ టైమ్స్లో కధనం వచ్చినా భారత్లో దీనిపై ఎలాంటి చర్చ జరగలేదని అన్నారు. అత్యంత పేదల నుంచి అదానీ సొమ్ము చేసుకున్నారని, ఈ స్టోరీ ఏ ప్రభుత్వాన్నైనా కుప్పుకూల్చుతుందని చెప్పారు. ఇది నేరుగా దోపిడీ చేయడమేనని మండిపడ్డారు. అదానీని ప్రధాని నరేంద్ర మోదీ పదేపదే కాపాడుతున్నారని, ఈ వ్యవహారంపై ప్రధాని మోదీ ఎందుకు నోరు మెదపడం లేదో తనకు అర్ధం కావడం లేదని అన్నారు.
Read More :