Raghav Chadha : రాజ్యసభ ఎంపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత రాఘవ్ చద్దాపై ఆ పార్టీ విమర్శల బాణం ఎక్కుపెట్టింది. చద్దాకు వ్యతిరేకంగా ఆప్ నేతలు వరుసగా స్పందిస్తున్నారు. ఆయన బీజేపీతో చేతులు కలిపారని ఆరోపిస్తున్నారు. రాజ్యసభలో ఆప్ డిప్యూటీ లీడర్గా ఉన్న రాఘవ్ చద్దాను ఆ బాధ్యతల నుంచి ఆప్ తొలగించింది. ఈ నేపథ్యంలో రాఘవ్ చద్దాకు, ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య మాటలయుద్ధం ప్రారంభమైంది. ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు.
తనను పదవి నుంచి తొలగించగలరేమో కానీ, ఓడించలేరని రాఘవ్ చద్దా అన్నారు. అయితే, ఆయనపై ఆప్ ఎదురుదాడికి దిగింది. పంజాబ్ సీఎం భగవంత్ మన్ కూడా చద్దాపై విమర్శలు గుప్పించారు. బీజేపీతో రాఘవ్ చద్దా చేతులు కలిపారని, ఇది ఆమ్ ఆద్మీ పార్టీలో ఆందోళన కలిగించిందని భగవంత్ మన్ అన్నారు. రాజ్యసభలో లేవనెత్తాల్సిన అంశాలపై ఆప్ సూచించే విషయాల్ని చద్దా పాటించలేదన్నారు. రాజ్యసభలో ప్రజల సమస్యలపై ప్రశ్నించమంటే, చద్దా మాత్రం సమోసాలపై ప్రశ్నించారని ఎద్దేవా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తప్పకుండా ఏ పార్టీ అయినా చర్య తీసుకుంటుందన్నారు. మరో సీనియర్ ఆప్ లీడర్ సౌరభ్ భరద్వాజ్ కూడా రాఘవ్ చద్దాపై మండిపడ్డారు.
చద్దాకు వీలైతే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందించాలని కోరారు. పంజాబ్, దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై చద్దా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాఘవ్ కొన్నేళ్లుగా భయపడుతున్నారని, మోదీకి వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నారని విమర్శించారు. సభలో మాట్లాడేందుకు దొరికే కొద్దిపాటి సమయంలో దేశం గురించి మాట్లాడాలని సూచించారు. చద్దా తీరుతో ఆప్ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని వ్యాఖ్యానించారు.