టెలికం ఉన్నతాధికారి భాటియా వెల్లడి
జైపూర్, జూన్ 29: సెల్ఫోన్ టవర్ల నుంచి విడుదలయ్యే రేడియేషన్ తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తుందన్న భయాందోళనలను టెలికం శాఖ డిప్యూటీ డైరెక్టర్ హర్వేశ్ భాటియా కొట్టివేశారు. ఈ రేడియేషన్ వల్ల ఎలాంటి హాని జరుగదని విద్యుత్-అయస్కాంత క్షేత్ర (ఈఎంఎఫ్) తరంగాలపై జరిపిన విస్తృత పరిశోధనల్లో తేలిందని చెప్పారు. మొబైల్ టవర్ల రేడియషన్పై ప్రజల్లో నెలకొన్న అపోహలను, అనుమానాలను తొలగించేందుకు టెలికంశాఖ మంగళవారం నిర్వహించిన వెబినార్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో మొబైల్ యూజర్ల సంఖ్య పెరిగిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా నిరంతరాయ సేవలు అందించేందుకు టవర్ల సంఖ్యను కూడా పెంచాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. వెబినార్లో పాల్గొన్న వైద్య నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, పోలీసులు, స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా భాటియా వ్యాఖ్యలను సమర్థించారు.