న్యూఢిల్లీ: సరిహద్దు ప్రాంతాల్లో చైనా, ఇతర పొరుగు దేశాల చొరబాట్లు, భారత భూభాగాల ఆక్రమణల విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తప్పించుకోనే ధోరణితో వ్యవహరిస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి. ఈ నెల 21న కేంద్ర హోంశాఖ లోక్సభలో పలు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉన్నది. అయితే లఢక్లో పెట్రోలింగ్ పాయింట్స్ను భారత్ కోల్పోవడంపై ఎంపీల ప్రశ్నలను కేంద్రం తుది జాబితా నుంచి తప్పించినట్టు తెలుస్తున్నది. కేంద్ర హోంశాఖకు సమర్పించిన ప్రశ్నల జాబితాను 35 నుంచి 24కు కోత పెట్టినట్టు ఓ ఉన్నతాధికారిని ఉటంకిస్తూ ఇంగ్లిస్ పత్రిక ఎకనమిక్ టైమ్స్ నివేదించింది. ఎందుకు ఉపసంహరించుకొన్నారన్న దానిపై హోం శాఖ అధికార ప్రతినిధిని ప్రశ్నించగా.. ఆయన స్పందించలేదని పేర్కొన్నది.
తూర్పు లఢక్ సరిహద్దులోని 65 పెట్రోలింగ్ పాయింట్ల(పీపీ)లో 26 పాయింట్లపై భారత్ నియంత్రణ కోల్పోయిన అంశం లేహ్-లఢక్ సూపరింటెండెంట్ పరిశోధనతో వెలుగులోకి వచ్చింది. ఈ పరిశోధన పత్రాన్ని జనవరి చివరి వారంలో ఢిల్లీలో జరిగిన డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీసు వార్షిక సదస్సులో ప్రజెంట్ చేశారు. భారత భద్రతా దళాల నియంత్రణ లేదా పెట్రోలింగ్ లేకపోవడం వలన తూర్పు లఢక్లోని 65 పెట్రోలింగ్స్ పాయింట్స్లో 26 పీపీల్లో భారత్ యాక్సెస్ కోల్పోయిందని వెల్లడించింది. ఈ నివేదిక కేంద్ర ప్రభుత్వంపై విమర్శలకు దారితీసిన నేపథ్యంలో.. సదస్సులో సమర్పించిన అన్ని పరిశోధనా పత్రాలను వెబ్సైట్ నుంచి తొలగించారు.