న్యూఢిల్లీ: కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీజీ ఫొటోలను ఆర్బీఐ ముద్రిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ నోట్లపై ఇక నుంచి గణేశుడు, లక్ష్మీదేవి ఫొటోలను కూడా ముద్రించాలని ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(Arvind Kejriwal) డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి అప్పీల్ చేశారు. కొత్తగా జారీ చేసే కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మతో పాటు లక్ష్మీదేవి, గణేశుడి ఫోటోలను కూడా ముద్రించాలని ఆయన కోరారు.
ఇండోనేషియాలో కరెన్సీ నోట్లపై గణేశుడి బొమ్మ ఉంటుందని, అలాంటప్పుడు మనం ఎందుకు ఆ దేవతలను మన కరెన్సీపై ముద్రించరాదు అని కేజ్రీవాల్ అడిగారు. గణేశుడు, లక్ష్మీదేవి బొమ్మలను కరెన్సీపై ముద్రించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. దేశ ఆర్థిక పరిస్థితి గడ్డుగా ఉందని, ఆ సమస్య నుంచి గట్టెక్కేందుకు ఆ దేవుళ్ల దీవెనలు కావాలని కేజ్రీవాల్ అన్నారు.