అమృత్సర్: పంజాబ్లోని బటిండాలో (Bathinda) పంట వ్యర్థాలను కాల్చడాన్ని (Farm Fires) అడ్డుకోవడానికి వెళ్లిన ఓ అధికారిని రైతులు అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా ఆయనతోనే ఓ కుప్పకు మంటపెట్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాలుష్యానికి కారణవుతుండటంతో పంజాబ్తోపాటు హర్యానా, ఢిల్లీల్లో పంట వ్యర్థాలను కాల్చడంపై ఆయా ప్రభుత్వాలు నిషేధం విధించాయి. దీనికోసం ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశాయి. ఇందులో భాగంగా బటిండాలోని పంట వ్యర్థాలను కాల్చడాన్ని ఓ అధికారి అడ్డుకోబోయాడు. దీంతో స్థానిక వ్యవసాయ సంఘానికి చెందిన 50-60 మంది రైతులు ఆయనను చుట్టుముట్టారు. అనంతరం సమీపంలో ఉన్న వరిగడ్డి కుప్ప వద్దకు తీసుకెళ్లారు. అతని చేతికి అగ్గిపెట్టె ఇచ్చి దానిని అంటుపెట్టాలని ఒత్తిడి చేశారు. చేసేదేం లేక అతడు దానిని కాల్చివేశాడు. అయితే ఈ వీడియో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (CM Bhagwant Mann) సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టుచేశారు. రైతుల చర్యను తీవ్రంగా ఖండించిన ఆయన.. వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
దీంతో అధికారిని అడ్డుకున్న రైతులపై పోలీసులు కేసు నమోదుచేశారు. వారి కోసం గాలిస్తున్నామని బటిండా సీనియర్ ఎస్పీ గుల్నీత్ సింగ్ ఖురానా (Gulneet Singh Khurana) చెప్పారు. ప్రభుత్వ అధికారి విధులను అడ్డుకున్నందుకుగాను వారిపై ఎఫ్ఐఆర్ నమోదుచేశామన్నారు.
రైతులు పంట వ్యర్థాలను కాల్చడం వల్లే ఢిల్లీ కాలుష్యానికి కారణమని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వెల్లడించింది. దేశ రాజధానిలో శీతాకాలం అంటే.. ముఖ్యంగా నవంబర్-డిసెంబర్ మధ్య కాలుష్యం భారీ స్థాయిలో నమోదవుతున్నది. దీనికి చుట్టుపక్కల రాష్ట్రాల రైతులు కాల్చే పంటల వ్యార్ధాల దగ్థం, వాహన కాలుష్యం, బాణసంచా కాల్చడం వంటివి కొంత ఆజ్యం పోస్తున్నాయని తెలిపింది.