చండీఘడ్ : పంజాబ్లోని మొహాలి జిల్లా కురాలి గ్రామంలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident)జరిగింది. గ్రామంలోని పెయింట్ ఫ్యాక్టరీలో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఒకరిని మొహాలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మిగిలినవారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మొహాలి, రూపార్ జిల్లాల నుంచి అయిదు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్ధలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించిందని, ఆ ప్రాంతమంతా మంటలు ఎగిసిపడటంతో దట్టమైన పొగ వ్యాపించిందని స్ధానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెలుగుచూడాల్సి ఉంది.