న్యూఢిల్లీ, నవంబర్ 25: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా మరోసారి ఉద్యమ శంఖారావం మోగింది. సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈనెల 26 నుంచి 28 వరకు నిర్వహించ తలబెట్టిన దేశవ్యాప్త నిరసనలకు రైతులు, కార్మికులు సిద్ధమయ్యారు. అన్ని రాష్ర్టాల్లోని రాజ్భవన్ల వద్ద ఆందోళనలు నిర్వహించనున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని రాష్ర్టాల్లో రైతు, కార్మిక సంఘాలు సన్నాహక కార్యక్రమాలు పూర్తి చేశాయి. పలు ప్రాంతాల్లో సభలు, జాతాలు నిర్వహించి మోదీ సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రచారం చేపట్టాయి. పంజాబ్లో వేలాది మంది రైతులు శనివారం ఉదయం ట్రాక్టర్ ట్రాలీలు, మినీ బస్సులు సహా 3 వేలకు పైగా వాహనాల్లో ఛండీగఢ్కు తరలివెళ్లారు. ఆదివారం ఉదయం ఐఐఎస్ఈఆర్ చౌక్ నుంచి రాజ్భవన్కు మార్చ్ చేపడుతామని రైతు నేతలు వెల్లడించారు. సాగు చట్టాలను రద్దు చేసి రెండేండ్లు అవుతున్నా.. ఆ సమయంలో ఇచ్చిన హామీలను మోదీ సర్కార్ ఇప్పటికీ అమలు చేయలేదని ఎస్కేఎం నేత దర్శన్పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన రైతాంగ పోరాటం విరమణ సమయంలో పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)తో సహా ఇచ్చిన ఇతర హామీలను అమలు చేయడంలో మోదీ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తున్నదని ఎస్కేఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. 2020లో జరిగిన ‘చలో ఢిల్లీ’ ఆందోళనలను గుర్తుచేయడంతో పాటు మోదీ సర్కార్ వైఖరిని ఎండగట్టేందుకు ఆందోళనలు చేపడుతున్నట్టు పేర్కొన్నది. బీజేపీ పాలనలో దేశ రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నదని విమర్శించింది. రైతులు తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధరలను కూడా పొందలేకపోతున్నారని పేర్కొన్నది. నష్టాలు, అప్పుల కారణంగా పంట పెట్టుబడికి తెచ్చిన రుణాలను తిరిగి కట్టలేక అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. రాజ్యాంగ దినోత్సవం నాడు ప్రారంభమయ్యే ఆందోళనల్లో భాగంగా అన్ని రాష్ర్టాల్లోని రాజ్భవన్లు, ఇతర ప్రాంతాల్లో రైతులు, కార్మికులు నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు రైతు సంఘాల నేతలు తెలిపారు.
బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా 2020లో కూడా ఇదే నవంబర్ 26న ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతల ఉద్యమం ప్రారంభమైంది. ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో దాదాపు 13 నెలల పాటు ఆందోళనలు కొనసాగాయి. ఉద్యమంలో దాదాపు 725 మంది అన్నదాతలు అమరులయ్యారు. ఉద్యమ తీవ్రత, ఒత్తిడికి తలొగ్గిన కేంద్రంలోని బీజేపీ సర్కార్.. నూతన సాగు చట్టాలను వెనక్కు తీసుకొంటున్నట్టు ప్రకటించింది. ఇదే సమయంలో కనీస మద్దతు ధరపై కమిటీ ఏర్పాటు చేస్తామని, రైతాంగం ఇతర డిమాండ్లను కూడా నెరవేరుస్తామని రైతులకు హామీ ఇచ్చింది. అయితే ఆ హామీలను నెరవేర్చకుండా మోదీ సర్కార్ మోసం చేసిందని, కాలయాపన చేస్తున్నదని రైతు సంఘాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి.