ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జయభేరి మోగించిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ కూడా పంజాబ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు తాజాగా ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నియామకం జరిగింది. ఆప్ ఎమ్మెల్యే కుల్తార్ సింగ్ సంధ్వాన్ను స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
46 ఏళ్ల కుల్తార్ సింగ్.. భారత మాజీ రాష్ట్రపతి జైల్ సింగ్కు మనవడి వరుస అవుతారు. జైల్ సింగ్ సోదరుడు జంగీర్ సింగ్ మనవడే కుల్తార్ సింగ్. ఆయన్ను స్పీకర్గా ఎన్నుకున్న తర్వాత.. ‘‘అందరికీ సమానమైన అవకాశాలు కల్పిస్తారని ఆశిస్తున్నా’’ అని భగవంత్ మాన్ అన్నారు. దేశంలో సభలకు పంజాబ్ అసెంబ్లీని రోల్ మోడల్ చేయాలని, అలాగే సభ సెషన్లు లైవ్ టెలికాస్ట్ అవుతాయని తెలిపారు.
అందరికీ మాట్లాడే అవకాశం ఇస్తూ.. దేశానికి పంజాబ్ అసెంబ్లీ మార్గదర్శకంగా మారాలని మాన్ ఆశించారు. ఆప్ నేతలతోపాటు కాంగ్రెస్ నేతలు కూడా కుల్తార్ సింగ్ నియామకాన్ని స్వాగతించారు. సభలో అందరికీ సమానంగా మాట్లాడే అవకాశాలు ఇస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ నేత రాణా కన్వర్ పాల్ సింగ్ ఇంతకుముందు స్పీకర్గా ఉన్నారు. ఇప్పుడు ఆ స్థానంలో కుల్తార్ సింగ్ పదవీ స్వీకారం చేశారు.