చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడైన నవజ్యోత్ సింగ్ సిద్ధూపై (Navjot Sidhu) క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ సీనియర్ నేతలు డిమాండ్ చేశారు. పార్టీ నిబంధనలు ఆయన ఉల్లంఘించినట్లు కాంగ్రెస్ హైకమాండ్కు ఫిర్యాదు చేశారు. పార్టీ క్యాడర్ను తప్పుదారి పట్టించేందుకు సిద్ధూ ప్రయత్నించినట్లు ఆ లేఖలో ఆరోపించారు. పంజాబ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సభ్యుడైన నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఫిబ్రవరి 1న జరిగిన పార్టీ సమావేశానికి హాజరుకాలేదు. పంజాబ్ ఇంచార్జ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దేవేంద్ర యాదవ్ ఫోన్ చేసినప్పటికీ స్పందించలేదు.
కాగా, అదే సమయంలో తన బలాన్ని ప్రదర్శించేందుకు సిద్ధూ వేరుగా పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సిద్ధూపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పంజాబ్కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు.
అయితే దీనికి ముందు మోగాలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ ర్యాలీ నిర్వహించడంపై పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా స్పందించారు. జనవరి 27న మాజీ ఎమ్మెల్యే మహేశ్ఇందర్ నిహాల్ సింగ్వాలా, ఆయన కుమారుడు ధరంపాల్ సింగ్తో సహా ఇద్దరు నాయకులను సస్పెండ్ చేశారు. అలాగే మరో 27 మంది కాంగ్రెస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.
మరోవైపు జనవరి 29న సిద్ధూ దీనిపై స్పందించారు. ఇలాంటి చర్యలు తనను బలహీనపరచలేవని, తన ఆశలను నీరుగార్చలేవంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయినప్పటికీ ప్రతి ఒక్కరూ తనను కిందకు లాగేందుకు పదే పదే ప్రయత్నిస్తున్నారని అందులో విమర్శించారు.