NITI Aayog | న్యూఢిల్లీ, మే 27(నమస్తే తెలంగాణ): ఫొటో సెషన్ల కోసమే ప్రధాని మోదీ నీతి ఆయోగ్ సమావేశాలను నిర్వహిస్తున్నారని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ విమర్శించారు. ఫొటోలు దిగేందుకు నీతి ఆయోగ్ సమావేశాలకు వెళ్లాలా? అని మాన్ ప్రశ్నించారు. హైదరాబాద్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశమయ్యాక మాన్ విలేకర్లతో మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల ప్రయోజనాలను కేంద్రంలోని బీజేపీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ‘అక్కడికి వెళ్లి ఏం చేయాలి. ఫొటో దిగడానికి వెళ్లాలా? ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా కేంద్రం పట్టించుకోవడం లేదు. గతేడాది ఇచ్చిన విజ్ఞప్తులకు ఇప్పటి వరకు మోక్షం కలగలేదు.
ఇదే విషయాన్ని చెబుతూ నీతి ఆయోగ్కు లేఖ రాశా. గత సమస్యలే పరిష్కారం కాలేదు. ఇప్పుడు హాజరైనా మళ్లీ అవే అంశాలు చెప్పాల్సి వస్తుంది. ఇదే విషయాన్ని చెబుతూ లేఖ రాశాను’ అని ఆయన పేర్కొన్నారు. రాష్ర్టాలకు ఆర్డీఎఫ్ (రూరల్ డెవలప్మెంట్ ఫండ్), ఎన్హెచ్ఎం నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతోనే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాలేదని వెల్లడించారు. భారత్ భిన్న మతాలు, సంస్కృతుల సమ్మేళనమని అన్నారు. అనేక రకాల పూలతో అల్లిన అందమైన మాల భారతదేశమని భగవంత్ మాన్ పేర్కొన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో శనివారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశం మొక్కుబడిగా సాగింది. ఈ సమావేశం ఎన్డీఏ పక్షాల సీఎంల మీటింగ్ని తలపించింది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన వివిధ రాష్ర్టాల సీఎంలు ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఏకంగా 11 మంది సీఎంలు గైర్హాజరు కావడంతో తూతూమంత్రంగా సమావేశాన్ని ముగించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలు, ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలపై కక్షసాధింపు చర్యలను వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష పార్టీల సీఎంలు సమావేశానికి దూరంగా ఉన్నారు. తమ రాష్ర్టాల ప్రయోజనాలను కేంద్రం పట్టించుకోవడం లేదని, తమ ప్రతిపాదనలకు విలువ లేనప్పుడు సమావేశాలకు వెళ్లడం సబబు కాదని భావించిన సీఎంలు గైర్హాజరయ్యారు.
ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో శనివారం ప్రధాని మోదీ అధ్యక్షతన నీతిఆయోగ్ సమావేశం జరిగింది. ‘వికసిత్ భారత్ @2047: టీమ్ ఇండియా పాత్ర’ థీమ్తో ఈ సమావేశాన్ని నిర్వహించారు. సీఎం కేసీఆర్తో పాటు వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు కేజ్రీవాల్ (ఢిల్లీ), భగవంత్ మాన్ (పంజాబ్), మమతా బెనర్జీ (పశ్చిమబెంగాల్), అశోక్ గెహ్లాట్ (రాజస్థాన్), నితీశ్ కుమార్ (బీహార్), పినరయి విజయన్ (కేరళ), ఎంకే స్టాలిన్ (తమిళనాడు), నవీన్ పట్నాయక్ (ఒడిశా) ఈ సమావేశానికి హాజరు కాలేదు. సీఎం కేసీఆర్తో సమావేశమయ్యేందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హైదరాబాద్ వచ్చారు. దీంతో కేసీఆర్ నీతి ఆయోగ్ మీటింగ్కు దూరంగా ఉన్నారు. కేంద్రం తాజాగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు నిరసనగా తాను నీతిఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. దేశంలో సమాఖ్యవాదం అనేది ఓ జోక్గా మారిందని కేంద్రం తీరును ఎండగట్టారు. ప్రధాని మోదీకి శుక్రవారం ఆయన రాసిన లేఖలో ఈ అంశాలను ప్రస్తావించారు.
పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా రాష్ర్టాల సీఎంలు మమతాబెనర్జీ, నితీశ్ కుమార్, నవీన్ పట్నాయక్ ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నందున హాజరు కాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. స్టాలిన్ విదేశీ పర్యటనలో ఉండగా, పినరయి విజయన్ కారణాలు వెల్లడించలేదు. ప్రతిపక్ష పార్టీల సీఎంలతో సరైన రీతిలో వ్యవహరించకపోవడం వల్లే వారు సమావేశాన్ని బహిష్కరించారని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ విమర్శించారు. వికసిత్ భారత్ @2047, ఎంఎస్ఎంఈ, మౌలిక వసతులు, పెట్టుబడులు, మహిళా సాధికారత, ఆరోగ్యం, పోషకాహారం, స్కిల్ డెవలప్మెంట్, గతి శక్తి తదితర అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించారు.