న్యూఢిల్లీ : పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీలో గురువారం సమావేశమయ్యారు. పంజాబ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మాన్ ప్రధాని మోదీని కలవడం ఇదే తొలిసారి. పంజాబ్ సమస్యలు, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై మాన్ ప్రధానితో చర్చించారు.
పంజాబ్ ఆర్ధిక పరిస్ధితులను మెరుగుపరిచేందుకు రూ 50,000 కోట్ల చొప్పున రెండేండ్ల పాటు ప్యాకేజ్ అందించాలని డిమాండ్ చేశానని ప్రధానితో భేటీ అనంతరం మాన్ పేర్కొన్నారు. దేశ భద్రతను కాపాడేందుకు తమకు కేంద్రం సహకారం కావాలని అన్నారు. పంజాబ్ ఆర్ధిక పరిస్ధితి సజావుగా లేనందున రెండేండ్ల పాటు రాష్ట్రానికి రూ 50,000 కోట్ల అందచేయాలని కోరామన్నారు.
ఇక పంజాబ్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించడంతో ఈనెల 16న భగవంత్ మాన్ పంజాబ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పూర్వీకుల గ్రామం ఖట్కర్ కలాన్లో మాన్ పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.