ముంబై: చికిత్సకు ముందే పది లక్షలు చెల్లించాలని ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది డిమాండ్ చేశారు. ఆ డబ్బు చెల్లించకపోవడంతో చికిత్స అందించేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యం విషమించడంతో గర్భిణీ మరణించింది. (Pregnant woman dies) మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. బీజేపీ ఎమ్మెల్సీ అమిత్ గోర్ఖేకు ప్రైవేట్ సెక్రటరీగా పనిచేస్తున్న సుశాంత్ భార్య తనిషా ఏడు నెలల గర్భిణి. గర్భంలో కవలున్న ఆమె సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడింది. దీంతో పూణెలోని దీనానాథ్ మంగేష్కర్ హాస్పిటల్కు ఆమెను తరలించారు.
కాగా, తనిషాకు చికిత్స అందించేందుకు పది లక్షలను హాస్పిటల్ సిబ్బంది డిమాండ్ చేశారు. ఆ డబ్బు చెల్లిస్తేనే చికిత్స ప్రారంభిస్తామని చెప్పారు. ముందుగా రూ.2.5 లక్షలు చెల్లిస్తానని ఆమె భర్త సుశాంత్ చెప్పినప్పటికీ చికిత్సకు నిరాకరించారు. ఒకేసారి పది లక్షలు చెల్లించలేక తనిషాను మరో హాస్పిటల్కు తరలించారు. అయితే చికిత్సలో జాప్యం వల్ల డెలివరీ కాంప్లికేషన్స్తో ఆమె మరణించింది.
మరోవైపు భార్య తనిషా మరణానికి దీనానాథ్ మంగేష్కర్ హాస్పిటల్ నిర్లక్ష్యం కారణమని ఆమె భర్త సుశాంత్ ఆరోపించాడు. ‘వారు జీవితం కంటే డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చారు. సకాలంలో చేర్చుకున్నట్లయితే ఆమె బతికి ఉండేది’ అని వాపోయాడు. ఆ హాస్పిటల్ నిర్లక్ష్యంపై ఆమె కుటుంబం ఫిర్యాదు చేసింది. దీంతో దర్యాప్తు కోసం మెడికల్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి తెలిపారు.
కాగా, ఎమ్మెల్సీ అమిత్ గోర్ఖే ఈ సంఘటనపై స్పందించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతానని అన్నారు. అయితే మీడియాలో ప్రసారమవుతున్న సమాచారం అసంపూర్తిగా ఉందని, తమ ప్రతిష్టను దెబ్బతీస్తున్నదని దీనానాథ్ మంగేష్కర్ హాస్పిటల్ పీఆర్వో ఆరోపించారు. అంతర్గతంగా విచారణ జరిపి నివేదిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అధికారులకు అన్ని వివరాలు సమర్పిస్తామని పేర్కొన్నారు.