Pune bandh | పుణెలో వ్యాపార, వాణిజ్య సంస్థల బంద్ కొనసాగుతున్నది. ఛత్రపతి శివాజీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఎన్సీపీ, శివసేన (థాకరే వర్గం) పిలుపు మేరకు బంద్ జరుగుతున్నది. సర్వమత శివప్రేమి పుణెకర్, మరఠా సంస్థ శంభాజీ బ్రిగేడ్ పుణె బంద్కు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా పట్టణంలో అన్ని దుకాణాలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. దక్కన్లోని ఛత్రపతి శంభాజీ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం మౌనదీక్ష ప్రారంభించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులను మోహరించారు. ఛత్రపతి శివాజీ మహరాజ్పై మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోష్యారీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పుణెలో గత కొన్ని రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి.
ఎన్సీపీ, శివసేన బంద్కు పలు సామాజిక, వ్యాపార సంస్థల మద్దతు లభించింది. ఫెడరేషన్ ఆఫ్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆఫ్ పుణె (ఎఫ్ఏటీపీ) అధ్యక్షుడు ఫతేచంద్ రాంకా గవర్నర్ ప్రకటనను ఖండించారు. బంద్కు మద్దతు ఇవ్వాలని వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు. అన్ని దుకాణాలు, కార్యాలయాలు మధ్యాహ్నం 3 గంటల వరకు మూసి ఉంచనున్నారు. నిత్యావసర సేవల దుకాణాలు ఉదయం 10 గంటల వరకు తెరవడానికి అనుమతించారు. మెడికల్ షాపులకు బంద్ నుంచి మినహాయించారు. పెట్రోల్, సీఎన్జీ బంకులు పని చేస్తూనే ఉన్నాయి. 100 మంది పోలీసులతో పాటు 1000 మంది జవాన్లను మోహరించారు.
నవంబర్ 19న ఔరంగాబాద్లో జరిగిన ఓ యూనివర్సిటీ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ.. శివాజీని పాత రోజులకు చిహ్నంగా అభివర్ణించారు. బాబాసాహెబ్ అంబేద్కర్, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీలు నవయుగానికి ఐకాన్లుగా ఆయన చెప్పడం శివాజీని అవమానించినట్లుగా ఎన్సీపీ, శివసేన (థాకరే వర్గం) భావిస్తున్నాయి. దాంతో పుణె బంద్కు పిలుపునిచ్చాయి.