న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ను ముమ్మరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ బయోటెక్ రూపొందించిన కొవాక్సిన్ టెక్నాలజీలను మూడు ప్రభుత్వ రంగ సంస్థలకు బదలాయించింది. ఇండియన్ ఇమ్యూనాలజికల్స్ లిమిటెడ్ (ఐఐఎల్), హాఫ్కైన్ బయో-ఫార్మాస్యూటికల్ కార్పొరేషన్ లిమిటెడ్, బీఐబీసీఓఎల్ లు వ్యాక్సిన్ తయారీకి అవసరమైన టెక్నాలజీని పొందాయి. భారత్ బయోటెక్ నుంచి ఈ పీఎస్ యూలు సాంకేతిక బదలాయింపు ఒప్పందం చేసుకున్నాయి.
వ్యాక్సిన్ తయారీకి ఈ మూడు సంస్థలకు అవసరమైన ఆర్థిక సాయాన్ని అందచేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇక హాఫ్కైన్ ఇనిస్టిట్యూట్ ఏడాదికి 22 కోట్ల డోసులు తయారు చేసే సామర్థ్యం ఉండగా నవంబర్ నుంచి ఉత్పత్తిని ప్రారంభిస్తుంది. ఐఐఎల్ ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఉత్పత్తిని చేపడుతుంది. మరోవైపు అంతర్జాతీయంగా వ్యాక్సిన్ల అందుబాటును పెంచేందుకు కొవిడ్ వ్యాక్సిన్లపై మేథో సంబంధ హక్కులను తొలగించాలని భారత్ సహా పలు దేశాలు కోరుతున్నాయి.