EOS-09 Mission | భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో కీలక ప్రయోగం చేపట్టబోతున్నది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ నెల 18న ఉదయం 6.59 గంటలకు పీఎస్ఎల్వీ-సీ61 రాకెట్ను నింగిలోకి పంపనున్నది. ఈ రాకెట్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దిన భూ పరిశీలనా ఉపగ్రహం రీశాట్-1బీని కక్ష్యలో ప్రవేశపెట్టనున్నది. రీశాట్-1బీ ఉపగ్రహంలో అమర్చిన సీ-బ్యాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్ (సార్) ప్రత్యేకత. ఈ రాడర్ సమాయంతో పగలు, రాత్రి.. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా భూ ఉపరితలాన్ని హై-రిజల్యూషన్ చిత్రాలను తీసి పంపుతుంది. ఇటీవల భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.
ఇలాంటి పరిస్థితులు నెలకొన్న సమయంలో భారత సైనిక దళాలకు వ్యూహాత్మకంగా ఉపయోగపడనున్నది. దేశ భద్రత, సైనిక అవసరాలకు అవసరమైన సమగ్ర సమాచారాన్ని అందించడంలో రీశాట్-1బీ కీలకం కానున్నది. ఉగ్రవాదుల స్థావరాలు, వారి కదలికలను పసిగట్టడంతో పాటు, సరిహద్దు ప్రాంతాలలో శత్రువుల బలగాలకు సంబంధించిన కార్యకలాపాలను కూడా నిశితంగా పరిశీలించి.. హై రిజల్యూషన్ ఫొటోలను తీసి పంపుతుంది. అలాగే, వ్యవసాయం, అటవీ, వరద పర్యవేక్షణ, విపత్తు నిర్వహణలో కీలకం కానున్నది. ఇందులో రౌండ్ ది క్లాక్ ఇమేజింగ్ కీలకమైంది. ఈ ఉపగ్రహంలో ఐదు ఇమేజింగ్ మోడ్ల ఉంటాయి. చిన్న వస్తువులను గుర్తించేందుకు అల్ట్రా హై రిజల్యూషన్ ఇమేజింగ్ సిస్టమ్ కలిగి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ 1,710 కిలోల ఉపగ్రహాన్ని ఇస్రో పీఎస్ఎల్వీ సహాయంతో నింగిలోకి పంపనున్నది. అనేక కీలకమైన ఉపగ్రహాల కోసం ఇస్రో పీఎస్ఎల్వీ వాహకనౌకను ఉపయోగించిన విషయం తెలిసిందే.