బెంగళూరు: కర్ణాటకలోని హుబ్బళి-ధార్వాడ్లో ఎంసీఏ విద్యార్థిని నేహా హీరేమఠ్ హత్యోదంతంపై నిరసనలు పెల్లుబుకుతున్నాయి. ఆమె కుటుంబ సభ్యులకు ముస్లింలు కూడా సంఘీభావం తెలుపుతున్నారు. బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు నిర్వహించింది. అయితే, ఆమెను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫయాజ్ ఆమెను ఇస్లాంలోకి మత మార్పిడి చేసేందుకు ప్రయత్నించాడని ఆమె తండ్రి, హుబ్బళి-ధార్వాడ్ నగర పాలక సంస్థ కాంగ్రెస్ కౌన్సిలర్ నిరంజన్ హీరేమఠ్ సోమవారం ఆరోపించారు.
ఈ కేసు దర్యాప్తులో హుబ్బళి-ధార్వాడ్ పోలీస్ కమిషనర్ రేణుక సుకుమార్, ఇతర పోలీసు అధికారులు కీలుబొమ్మలుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమార్తె హత్య జరిగిన రోజే తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఇప్పటికి నాలుగు రోజులు గడచిపోయినప్పటికీ, ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంసీఏ ప్రథమ సంవత్సరం విద్యార్థిని నేహా హీరేమఠ్ హుబ్బళి-ధార్వాడ్లోని ఓ కళాశాలలో గురువారం హత్యకు గురైన సంగతి తెలిసిందే. నేహా, ఫయాజ్ ప్రేమించుకున్నారని కర్ణాటక హోం మంత్రి జీ పరమేశ్వర చెప్తుండగా, ఇది లవ్ జీహాద్ కాదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అంటున్నారు.
నేహా హత్య కేసు దర్యాప్తు బాధ్యతలను క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ)కి అప్పగించాలని, సత్వర విచారణ కోసం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం ప్రకటించారు.
నేహా హత్యను ఖండిస్తూ ధార్వాడ్లో ముస్లింలు పెద్ద సంఖ్యలో ప్రదర్శన నిర్వహించారు. అంజుమన్-ఏ-ఇస్లాం ధార్వాడ్ శాఖ, ముస్లిం విద్యార్థులు ఈ ప్రదర్శనను నిర్వహించారు. నేహా కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపారు. ముస్లింలు నిర్వహించే దుకాణాలను ఒక పూట మూసివేశారు. “నేహాకు న్యాయం జరగాలి” అనే పోస్టర్లను ఏర్పాటు చేశారు.