లక్నో, సెప్టెంబర్ 26: ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఎన్నికల హామీల మోసాలపై రైతాంగం రగిలిపోతున్నది. మళ్లీ తమకు అధికారం కట్టబెడితే అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ హామీల వర్షం కురిపించిన బీజేపీ, ఇప్పుడు ఉచిత విద్యుత్తు విషయంలో మోసం చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా భారీ ఉద్యమం చేపడుతామని యోగి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఎన్నికల ప్రచారం సమయంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, బోరుబావులకు గ్రాంట్లు మంజూరు చేస్తామని బీజేపీ హమీ ఇచ్చింది. అయితే ఈ హామీని తుంగలో తొక్కుతూ.. ‘రైతులు వ్యవసాయం కోసం పొలాల్లో వేసుకున్న బోర్లకు ఉచిత విద్యుత్తు ఇవ్వం’ అని యూపీ విద్యుత్తు మంత్రి అరవింద్కుమార్ ఇటీవల అసెంబ్లీలో ప్రకటించారు. హార్స్పవర్కు వసూలు చేస్తున్న చార్జీ తగ్గించామని, పూర్తి ఉచితంగా కరెంట్ సరఫరా చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
హామీల అమలులో మోసం
తిరిగి తమకు అధికారం ఇస్తే రానున్న ఐదేండ్ల పాటు రైతులకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఇస్తామని బీజేపీ తన మ్యానిఫెస్టోలో హామీఇచ్చింది. దీంతో పాటు వరి, గోధుమ పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) నిర్ణయిస్తామని, చెరకు మిల్లుల ఆధునీకరణకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తామని, 14 రోజుల్లో చెరకు రైతులకు చెల్లింపులు చేస్తామని కూడా అందులో పేర్కొన్నది. అయితే ఈ హామీల అమలు ను మాత్రం మరిచింది. యోగి ప్రభు త్వ మోసంపై ఉద్యమబాట పడుతామని సంయుక్త కిసాన్ మోర్చా, బీకేయూ, ఏఐకేఎస్ హెచ్చరించాయి.
మ్యానిఫెస్టో.. అబద్ధాల పుట్ట
బీజేపీ మ్యానిఫెస్టో అబద్ధాల పుట్ట అని ఏఐకేఎస్ యూపీ శాఖ ప్రధాన కార్యదర్శి ముకుత్ సింగ్ మండిపడ్డారు. 2017, 2022 ఎన్నికల సమయంలో అవే హామీలను పదేపదే గుప్పించడం తప్ప అమలు చేసింది లేదని దుయ్యబట్టారు. ఉచిత విద్యుత్తు వంటి హామీలను అమలు చేయకపోగా, విద్యుత్తు బిల్లును భారీగా పెంచుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ మోసంపై రైతులు పోరుబాటకు సిద్ధమౌతున్నారని పేర్కొన్నారు. వచ్చే నెల 2-4 తేదీల్లో బదోహి పట్టణంలో రాజ్యసమ్మేళన్ జరుగనున్నదని, ఈ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా రైతులు హాజరవుతారని, బీజేపీ ప్రభుత్వ మోసాలపై వివరిస్తామని తెలిపారు. ఆ తర్వాత రైతులు నవంబర్ 26న రాజధాని లక్నోలో జరిగే రాజ్భవన్ ఘెరావ్ కార్యక్రమానికి హాజరవుతారని, లఖింపూర్ ఘటనలో న్యాయం చేయాలని, రైతులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలన్న డిమాండుతో బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేస్తామని చెప్పారు.
రైతులను దోపిడీ చేస్తున్న బీజేపీ
ఉచిత విద్యుత్తు విషయంలో రైతులను మోసం చేసిన బీజేపీ ప్రభుత్వం.. బోరుబావుల వద్ద మీటర్లు పెడుతున్నదని బీకేయూ నేత రాకేశ్ టికాయిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీటర్లు అమర్చిన ప్రభుత్వం ఈ తర్వాత ఉచిత విద్యుత్తు ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. బోరుబావుల లోడును 10 హార్స్పవర్ నుంచి 23 హార్స్పవర్కు పెంచి రైతులను దోపిడీ చేస్తున్నదని అన్నారు. చెరకు బకాయిల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతున్నదని పేర్కొన్నారు. ఎస్కేఎం యూపీ కమిటీ సభ్యుడు తజిందర్ సింగ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ మోసానికి వ్యతిరేకంగా ఈనెలలో భారీ ఉద్యమాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు.