న్యూఢిల్లీ: అమెరికాతో భారత్ కుదుర్చుకోబోతున్న వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా మంగళవారం న్యూఢిల్లీలో పంజాబ్ రైతులు ‘మహా పంచాయత్’ చేపడుతున్నారు. దీంట్లో పాల్గొనేందుకు పంజాబ్ నుండి వేలాదిమంది రైతులు వివిధ బృందాలుగా బయల్దేరుతున్నారు. ఢిల్లీలోని కిసాన్ ఘాట్ వద్ద నిర్వహిస్తున్న ఈ సమావేశానికి ‘దేశ్ బచావో మోర్చా’ పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా సుమారు 550 రైతు సంఘాలు, సామాజిక సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం వల్ల చిన్న రైతులు, వ్యాపారుల ఉపాధి అవకాశాలు దెబ్బతినే అవకాశముందని రైతు నాయకులు చెబుతున్నారు. ఈ ఒప్పందంపై భారత్ ముందుకు వెళ్లరాదంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మరింత పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరిస్తున్నారు. కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ పంజాబ్ నాయకుడు జర్మన్జిత్ సింగ్ బండాలా విలేకర్లతో మాట్లాడుతూ, ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం భారతీయ రైతులు, కార్మికులు, చిన్న చిన్న వ్యాపారులు సహా విస్తృత ప్రజానీకంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు.
అమెరికాలో వ్యవసాయం చాలా పెద్ద ఎత్తున సాగుతుందని, వేలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న పొలాలకు గణనీయమైన ప్రభుత్వ సబ్సిడీలు మద్దతుగా ఉంటాయని బండాలా అన్నారు. మరోవైపు భారత్లో దీనికి విరుద్ధమైన వాతావరణం ఉంటుందని, భారతీయ రైతుల్లో అత్యధికమంది రైతులు సాగు చేస్తున్న భూమి కేవలం రెండు, రెండున్నర ఎకరాలు మాత్రమే ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు భారత మార్కెట్లోకి ప్రవేశిస్తే, మన రైతులకు ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుందని వివరించారు. వ్యవసాయ ఆదాయం దారుణంగా పడిపోయే ప్రమాదముందని హెచ్చరించారు. మితిమీరిన విదేశీ ప్రభావం నుండి గత ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని రక్షించాయని, మోదీ సర్కార్ అమెరికా ఒత్తిడితో వాణిజ్య ఒప్పందంపై ముందుకు సాగుతున్నదని రైతు నాయకులు ఆరోపిస్తున్నారు.