Cancer | హైదరాబాద్, జనవరి 12 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): క్యాన్సర్ నిర్ధారణలో శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. 18 రకాల క్యాన్సర్లను ప్రారంభ దశలోనే గుర్తించే కొత్త డీఎన్ఎ పరీక్షను అభివృద్ధి చేశారు. ఇది వైద్య చరిత్రలో గొప్ప విప్లవంగా వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ పరీక్ష క్యాన్సర్ స్క్రీనింగ్లో కొత్త శకానికి నాంది పలుకుతుందని అంటున్నారు. ప్రత్యేకించి క్యాన్సర్లలో లింగ నిర్దిష్ట వ్యత్యాసాలను గుర్తించే విషయంలో ఆశాజనకంగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
ఈ పరీక్ష అత్యంత కచ్చితమైన, బహుళ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షకు మార్గం సుగమం చేస్తుందని చెప్పారు. పురుషులలో 93% శాతం, మహిళల్లో 84% శాతం క్యాన్సర్లను గుర్తించడం జరిగిందని, ఆ పరీక్షల్లో 99% కచ్చితమైన ఫలితాలు వెలువడ్డాయని శాస్త్రవేత్తలు బీఎంజే ఆంకాలజీ జర్నల్లో ప్రచురితమైన పరిశోధనా పత్రంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆరుగురిలో ఒకరు క్యాన్సర్ కారణంగా మరణిస్తున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.