చెన్నై, జూలై 5: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొన్ని రాష్ర్టాల పట్ల తీవ్ర వివక్ష చూపుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నవేళ డీఎంకే నేత, కేంద్ర మాజీ మంత్రి ఏ రాజా సంచలన ప్రకటన చేశారు. తమిళనాడుకు స్వయంప్రతిపత్తి ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సమక్షంలోనే రాజా ఈ డిమాండ్ చేయటం విశేషం. తమిళనాడుపై నరేంద్రమోదీ సర్కారు తీవ్ర వివక్ష చూపుతున్నదని ఆరోపించారు. ‘నెల క్రితం ప్రధాని చెన్నై వచ్చినప్పుడు ఆయన సమక్షంలోనే సీఎం స్టాలిన్ తమిళనాడుకు స్వయంప్రతిపత్తి కావాలని డిమాండ్ చేశారు. కొంతమంది దీనిని తప్పుపడుతున్నారు. ప్రధాని సమక్షంలో ఒక ముఖ్యమంత్రి ఇలా మాట్లాడవచ్చా? అని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ సమస్య చాలా సుస్పష్టం. దేశం మొత్తం జీఎస్టీ ఆదాయంలో తమిళనాడు నుంచే 10 శాతం వెళ్తున్నది.
మొత్తం పన్నుల ఆదాయంలో 6.5 శాతం తమిళనాడు రాష్ట్రమే ఇస్తున్నది. కానీ, కేంద్రం నుంచి రాష్ర్టానికి వస్తున్న నిధులు 1.2 శాతం మాత్రమే. సమాఖ్య వ్యవస్థలో ఇదే పెద్ద అన్యాయం’ అని మండిపడ్డారు. ‘అన్ని రాష్ర్టాలను సమానంగా చూస్తున్నామని ప్రధానమంత్రి అంటున్నారు. దేశాన్ని ఐక్యంగా ఉంచాలంటే హిందీ భాషే కీలకమని హోంమంత్రి అమిత్ షా నమ్ముతున్నారు. ద్రవిడ ఉద్యమ మూలపురుషుడు పెరియార్ రామస్వామి తుదిశ్వాస వరకు ప్రత్యేక తమిళదేశాన్ని ఆకాంక్షించారు. ఆయన డిమాండ్ను మేం ఎప్పుడో వదిలేశాం. తమిళనాడుకు స్వయంప్రతిపత్తి ఇస్తే చాలన్న అన్నాదురై మార్గంలో మా ముఖ్యమంత్రి పయనిస్తున్నారు. సీఎం స్టాలిన్ సమక్షంలో ఇప్పుడు పీఎం మోదీ, హోంమంత్రి అమిత్షాకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా.. మమ్మల్ని మళ్లీ పెరియార్ దారిలోకి వెళ్లేలా చేయవద్దు. మమ్మల్ని అణచివేయాలని చూడొద్దు. మళ్లీ స్వతంత్ర తమిళదేశం కోసం డిమాండ్ చేసేలా పరిస్థితులు మార్చొద్దు. తమిళనాడుకు స్వయంప్రతిపత్తి ఇవ్వండి. అందుకు మేం అర్హులం. మా లక్ష్యం చేరుకొనేవరకు విశ్రమించం.. పోరాటం వదిలిపెట్టం’ అని తెగేసి చెప్పారు.
దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని రాష్ర్టాలపై తీవ్ర వివక్ష చూపిందని రాజా ఆరోపించారు. డీఎంకే వ్యవస్థాపకుడు, తమిళనాడు మొదటి ముఖ్యమంత్రి అన్నాదురై 1969లో ఢిల్లీ వెళ్లి అప్పటి రాష్ట్రపతిని, ప్రధానిని కలిసిన తర్వాత అన్న మాటలు గుర్తున్నాయా? ప్రజాస్వామ్యం అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయటం కాదు. తోటి పౌరులను సమానంగా గౌరవించే వ్యక్తిత్వం ఉండాలి. మాకు కేంద్రంలో గౌరవం దక్కట్లేదు. నిధులూ అరకొరగా ఇస్తున్నారు అని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా రాష్ర్టాల హక్కులను కాలరాసింది. నిధుల కోసం రాష్ర్టాలు కేంద్రం వద్ద భిక్షమెత్తుకొనేలా చేసింది. 1967లో తమిళనాడుతోపాటు ఉత్తరప్రదేశ్, బీహార్ తదితర రాష్ర్టాల్లో ఓడిపోయే వరకు కాంగ్రెస్ ఇలాగే వ్యవహరించింది’ అని గుర్తుచేశారు.