ఇంఫాల్, మే 30: ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో నెలకొన్న సంక్షోభానికి వెంటనే పరిష్కారం చూపాలని రాష్ర్టానికి చెందిన ప్రముఖ క్రీడాకారులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతియుత, సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగితే తమ పతకాలు, అవార్డులను భారత ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఒలింపిక్ పతక విజేత మీరాబాయ్ చానుతో సహా 11 మంది క్రీడాకారులు ప్రధాని మోదీకి లేఖ రాశారు. తగిన చర్యలు తీసుకోకుంటే భవిష్యత్తులో తాము భారతదేశానికి ప్రాతినిధ్యం వహించబోమని, వర్ధమాన క్రీడాకారులకు శిక్షణ ఇవ్వబోమని తేల్చిచెప్పారు. సాధారణ ప్రజలపై కుకీ మిలిటెంట్ల దాడులను ఖండిస్తున్నామన్నారు.
కుకీ మిలిటెంట్ గ్రూపులతో చేసుకొన్న ఒప్పందాన్ని రద్దు చేయాలన్నారు. అక్రమ వలసదారులందరినీ రాష్ట్రం బయటకు పంపాలన్నారు. గతకొన్ని వారాలుగా మూసివున్న జాతీయ రహదారి-2ను తెరువాలన్నారు. పలు ప్రాంతాల్లో నేషనల్ హైవేను మూసివేయడం వలన నిత్యావసరాల ధరలు పెరిగాయని, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. లేఖపై సంతకాలు చేసిన వారిలో మీరాబాయ్ చాను(పద్మశ్రీ, ఖేల్త్న్ర), ఎల్ అనిత చాను(ధ్యాన్చంద్ అవార్డు గ్రహీత), అర్జున అవార్డు గ్రహీతలు కుంజరని దేవి(పద్మశ్రీ), ఎల్ సరిత దేవి, సంధ్యారాణి దేవి(పద్మశ్రీ), భారత మహిళా ఫుట్బాట్ టీమ్ మాజీ కెప్టెన్ బెమ్బెమ్ దేవి(పద్మశ్రీ) తదితరులు ఉన్నారు. మణిపూర్ పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్షాకు ఈ మెమోరాండం సమర్పించేందుకు వెళ్లగా.. ఆయన అందుబాటులో లేకపోవడంతో సీఎం బీరేన్ సింగ్కు అందజేశారు.
మణిపూర్లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు మరికొద్ది రోజులు పడుతుందని సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ మంగళవారం తెలిపారు. రాష్ట్రంలో ఘర్షణలకు, వేర్పాటువాదానికి సంబంధం లేదన్నారు. కాగా, మణిపూర్ ఘర్షణల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం, బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వనున్నట్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. మరోవైపు మణిపూర్ హింసాకాండ అంశంపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే నేతృత్వంలోని బృందం రాష్ట్రపతి ముర్మును కలిసింది. ఘర్షణలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని కమిటీ చేత విచారణ జరిపించాలని కోరింది.