న్యూఢిల్లీ, డిసెంబర్ 4: రక్షణ రంగ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకొన్నది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఏకే-203 రైఫిళ్ల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. రష్యా సహకారంతో ఉత్తరప్రదేశ్లోని అమేఠీలో ఐదు లక్షల ఏకే-203 రైఫిళ్ల తయారీకి శనివారం తుది అనుమతులు మంజూరు చేసింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ సోమవారం భారత పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు అనుమతులు లభించడం విశేషం. ప్రాజెక్టులో భాగంగా భారత్ 20వేల ఏకే-203 రైఫిళ్లను రష్యా నుంచి కొనుగోలు చేసింది. తర్వాత యూపీలో ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం ఆర్మీ వినియోగిస్తున్న ఇన్సాస్ రైఫిళ్ల స్థానంలో ఈ తుపాకులను ప్రవేశపెట్టనున్నారు. ఏకే-203 రైఫిళ్ల నుంచి తూటాలు 300 మీటర్ల వరకు దూసుకెళ్లగలవు.