బ్యాలట్ పేపర్తోనే ఓటింగ్
నోటాకు అవకాశం ఉండదు
1971 జనాభాను బట్టి ఎంపీ, ఎమ్మెల్యేల ఓటు విలువ లెక్కింపు
న్యూఢిల్లీ : ఆర్టికల్ 54 ప్రకారం రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. పార్లమెంట్ ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులతో పాటు అన్ని రాష్ర్టాలు, ఢిల్లీ, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికైన శాసనసభ్యులను కలిపి ఎలక్టోరల్ కాలేజీగా పిలుస్తారు. పార్లమెంట్, శాసనసభల్లోని నామినేటెడ్ సభ్యులు, శాసనమండలి సభ్యులు ఎలక్టోరల్ కాలేజీలో ఉండరు. వీరికి ఓటు వేసే హక్కు లేదు.
ఓటింగ్ విధానం ఇలా..
రాష్ట్రపతి ఓటింగ్ బ్యాలట్ పేపర్ విధానంలో జరుగుతుంది. ఓటింగ్ సమయంలో వాడే పెన్నును ఈసీనే ఇస్తుంది. ఆ పెన్నుతోనే ఓటెయ్యాలి. ఈ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఉండదు. ఓటేయడానికి, గైర్హాజరయ్యేందుకు ప్రజాప్రతినిధులకు స్వేచ్ఛ ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నికకు పార్టీలు తమ ఎమ్మెల్యేలు, ఎంపీలకు విప్ జారీ చేయకూడదు. అలాగే, ఈ ఎన్నికల్లో నోటాకు అవకాశం లేదు. ఏదో ఒక అభ్యర్థికి ఓటు వేయాల్సిందే.
బ్యాలట్ పేపర్ ఉండేదిలా..
సాధారణ ఎన్నికల్లో లాగా రాష్ట్రపతి ఎన్నికల్లో వినియోగించే బ్యాలట్ పేపర్లో ఎన్నికల గుర్తులు ఉండవు. రెండు వరుసలు మాత్రమే ఉంటాయి. మొదటి దాంట్లో అభ్యర్థుల పేర్లు.. దానికి ఎదురుగా ఉన్న వరుసలో ప్రాధాన్యతా క్రమాన్ని తెలియజేసే బాక్స్ ఉంటుంది. ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థులకు 1, 2, 3 ఇలా.. ప్రాధాన్యతా క్రమాన్ని కేటాయించాలి.
50 మంది మద్దతు ఉంటేనే..
రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలంటే సదరు అభ్యర్థిని 50 మంది ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు ప్రతిపాదించి, మరో 50 మంది ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు బలపరుచాలి. అభ్యర్థి నామినేషన్కు రూ. 15 వేలను సెక్యూరిటీ డిపాజిట్గా చెల్లించాలి.
ఓటర్లు ఎంతమంది?
ఈసారి జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు మొత్తం 4,809 మంది ఓటర్లుగా పాల్గొనబోతున్నారు. ఎంపీలు (776 మంది.. రాజ్యసభ-233, లోక్సభ-543) ఓటు విలువ 5,43,200. ఎమ్మెల్యేలు (4,033) ఓటు విలువ 5,43,231.
ఓటు విలువను ఎలా గణిస్తారు?
ప్రజాప్రతినిధుల ఓటు విలువ గణనకు 1971 నాటి 54.93 కోట్ల దేశ జనాభానే ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. 2026 వరకూ ఇదే ప్రాతిపదిక కొనసాగుతుంది. ఎమ్మెల్యేల ఓటు విలువను ఈ విధంగా లెక్కిస్తారు. ఏదైనా ఓ రాష్ట్రంలోని మొత్తం అసెంబ్లీ సీట్లను వెయ్యితో గుణించాలి. ఆ వచ్చిన సంఖ్యతో 1971లో ఆ రాష్ట్రంలో ఉన్న జనాభాను భాగించాలి. అప్పుడు ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ వస్తుంది. ఇక ఎంపీ ఓటు విలువ కోసం.. రాష్ర్టాల మొత్తం ఓట్ల విలువ 5,43,231ను మొత్తం ఎంపీలు 776తో భాగించాలి. అప్పుడు ఒక్కో ఎంపీ ఓటు విలువ వస్తుంది.
మన రాష్ట్ర ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 132
1971 జనాభా లెక్కల ప్రకారం ఓటు విలువను (ఎంపీ, ఎమ్మెల్యేలు) నిర్ధారిస్తున్నారు. ఉమ్మడి ఏపీలోని తెలంగాణ ప్రాంతంలో అప్పుడు జనాభా 1,57,02,122గా లెక్కగట్టారు. ఈ లెక్కన రాష్ట్రంలో ఉన్న 119 ఎమ్మెల్యేల్లో ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 132గా నిర్ణయించారు. అలాగే దేశవ్యాప్తంగా ఎంపీల అందరికీ సమాన ఓటు విలువ ఉంటుంది. ఈ లెక్కన మన రాష్ట్ర ఎంపీ ఓటు విలువ 700గా ఉన్నది.