న్యూఢిల్లీ: లోక్సభ కార్యకలాపాలు ఆశించిన స్థాయిలో జరగలేదని స్పీకర్ ఓం బిర్లా ( Om Birla ) తెలిపారు. లోక్సభను నిరవధిక వాయిదా వేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. సభా వ్యవహారాలు ఆశించిన స్థాయిలో జరగకపోవడం తనను బాధించినట్లు చెప్పారు. వీలైనంత వరకు సభా కార్యక్రమాలు జరిగే విధంగా చూసినట్లు తెలిపారు. ప్రజలకు సంబంధించిన అంశాలపై చర్చలు జరిగినట్లు చెప్పారు. కానీ విపక్షాలు సభా కార్యక్రమాలను నిత్యం అడ్డుకున్నట్లు ఆయన వెల్లడించారు. గత రెండేళ్ల నుంచి సభలో గరిష్ట స్థాయిలో చర్చలు జరిగినట్లు తెలిపారు. ఈసారి 20 బిల్లులు పాసైనట్లు స్పీకర్ బిర్లా చెప్పారు. ఓబీసీ బిల్లుకు అన్ని పార్టీల సభ్యులు సహకరించినట్లు ఆయన వెల్లడించారు. స్వాతంత్య్రానికి 75 ఏళ్లు నిండిన నేపథ్యంలో ప్రగతి సమీక్ష అవసరమని ఆయన తెలిపారు. వర్షాకాల పార్లమెంట్లో భాగంగా జూలై 19న ప్రారంభమైన లోక్సభ.. రెండు రోజుల ముందే నిరవధిక వాయిదా పడింది. ఈసారి 74 గంటల 46 నిమిషాల పాటు లోక్సభ జరిగినట్లు స్పీకర్ వెల్లడించారు.