NEET | వైద్యవిద్యలో అడ్మిషన్ల కోసం ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్షలో `రిగ్గింగ్ రాకెట్`గా వ్యవహరించిన ఎనిమిది మందిని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అరెస్ట్ చేశారు. భారీ మొత్తంలో ముడుపులు తీసుకుని, ఇతరుల స్థానే అభ్యర్థులుగా పరీక్ష రాయడానికి ప్రయత్నించారని అధికారులు తెలిపారు. అసలైన అభ్యర్థుల స్థానే పరీక్ష రాయడానికి నిందితులు ఐడీ కార్డులు, పాస్వర్డ్లు తీసుకున్నారని చెప్పారు. వారు అసలు అభ్యర్థుల్లా పరీక్షకు హాజరు కావడానికి ఫొటోల మార్పింగ్కు పాల్పడ్డారని సీబీఐ అధికారులు తెలిపారు.
బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ (ఎంబీబీఎస్), బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (బీడీఎస్), బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్ అండ్ సర్జరీ (బీఏఎంఎస్), బ్యాచిలర్ ఆఫ్ సిద్ధ మెడిసిన్ అండ్ సర్జరీ (బీఎస్ఎంఎస్), బ్యాచిలర్ ఆఫ్ యునానీ మెడిసిన్ అండ్ సర్జరీ (బీయూఎంఎస్), బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (బీహెచ్ఎంఎస్), బీఎస్సీ (హెచ్) నర్సింగ్ కోర్సుల్లో అడ్మిషన్లకు నీట్ క్వాలిఫయింగ్ పరీక్ష.