లక్నో : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ను జాతీయ జెండా ఎగురవేసేందుకు అనుమతించబోమని ఖలిస్ధాన్ అనుకూల గ్రూప్ సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) శుక్రవారం హెచ్చరించింది. యూపీ సీఎంను బెదిరిస్తూ అంతర్జాతీయ ఫోన్ నెంబర్ నుంచి యూపీ పోలీసులకు వచ్చిన ఫోన్ కాల్ కలకలం రేపింది. జాతీయ జెండాను ఎగురవేయనీయకుండా యూపీ సీఎంను అడ్డుకోవడంతో పాటు థర్మల్ ప్లాంట్లను మూసివేయాలని యూపీ పోలీసులకు ఆడియో మెసేజ్ వచ్చింది.
ఎస్ఎఫ్జేకు చెందిన గుర్పత్వంత్ సింగ్ పన్నన్ పేరుతో వచ్చిన ఈ సందేశంలో షహరన్పూర్ నుంచి రాంపూర్ వరకూ యూపీలోని పశ్చిమ ప్రాంతాన్ని ఖలిస్తాన్ అదుపులోకి తీసుకుంటుందని పేర్కొంది. ఈ నెంబర్ను ట్రేస్ చేసి ఆడియో మెసేజ్ వివరాలను ఆరా తీస్తామని యూపీ ఏడీజీ ప్రశాంత్ కుమార్ వెల్లడగించారు. గతంలో హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్లకూ ఇదేతరహాలో బెదిరింపులు వచ్చాయి.