లక్నో : తొలిసారి గాంధీ కుటుంబం నుంచి అసెంబ్లీకి పోటీచేసేందుకు ప్రియాంకగాంధీ వాద్రా (Priyanka Vadra) ముందుకొస్తున్నారు. త్వరలో జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రియాంక నిర్ణయించినట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్కు పట్టున్న రాయ్బరేలి, ఆమేథి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకదాని నుంచి నామినేషన్ వేసేందుకు ప్రియాంక నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా, యూపీ ఇంఛార్జీగా ఉన్న ప్రియాంక వాద్రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ, ఇప్పటివరకు ఎన్నికల్లో పోటీ చేయలేదు. ప్రియాంక వాద్రా పోటీ చేయడం ద్వారా ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ బలపడేందుకు అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటివరకు గాంధీ కుటుంబం నుంచి అసెంబ్లీకి పోటీచేసిన వారు ఎవరూ లేరు. ప్రియాంక పోటీ చేస్తే తొలి వ్యక్తి అవుతారు. ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ, సోనియాగాంధీ, రాహుల్గాంధీ.. ఇలా అందరూ లోక్సభ ఎన్నికల్లోనే పోటీచేశారు. అయితే, ప్రియాంక మాత్రం యూపీ అసెంబ్లీపైనే గత కొన్నాళ్లుగా పనిచేస్తున్నారు. ఆమేథి లేదా రాయ్బరేలీ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని పార్టీ వర్గాలు అంటుండగా.. ఆమేథి లోక్సభపై కన్నేశారని మరికొందరు చెప్తున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో సోదరుడు రాహుల్గాంధీ ఓటమికి బదులు తీర్చుకోవాలన్న కసితో ప్రియాంక ఉన్నారని వారంటున్నారు. అందుకే 2024 లోక్సభ ఎన్నికల్లో ఆమోథీ లోక్సభ నుంచి పోటీ చేసి ప్రస్తుత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ఛాలేంజ్ విసురుతారని వారు చెప్తున్నారు.
గతంలో లక్నోలో జరిగిన సమావేశంలో ప్రియాంక ఎన్నికల ప్రచారానికి రావడం ద్వారా యూపీలో కాంగ్రెస్ కొత్త బలాన్ని పొందుతుందని సలహా కమిటీ కూడా ప్రియాంకకు చెప్పింది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రియాంకకు సూచించారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే, లోక్సభకు పోటీ చేయాలా? లేదా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాలా? అనేది ప్రియాంక వాద్రా ఇంకా తేల్చుకోలేదు. అయితే, ఎన్నికలకు మాత్రం సన్నద్ధమవుతున్నట్లుగా ఆమె కార్యాచరణ బట్టి తెలుస్తున్నది.
ఈనెల 26 న శ్రీనగర్ దాల్ సరస్సుపై తొలి ఎయిర్షో
గాంధీ జయంతి కల్లా గాడ్సే విగ్రహం ప్రతిష్ట
నీరజ్ జావెలిన్ కోచ్ ఉవే హూన్ తొలగింపు
బీఏలో ఆప్షనల్ సబ్జెక్ట్గా ‘రామ్చరిత్మానస్’.. ఎక్కడంటే?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..