న్యూఢిల్లీ : టోక్యో ఒలింపిక్స్లో జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించేందుకు కారణమైన కోచ్పై (Javelin coach) వేటు పడింది. వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మూడు నెలల తర్వాత ఆ కోచ్పై చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తున్నది. అయితే, కోచ్లు, అథ్లెట్ల పనితీరు, ప్రదర్శనపై సమీక్ష అనంతరం జావెలిన్ త్రో కోచ్ పదవి నుంచి ఉవే హూన్ను తొలగించాలని భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) నిర్ణయించింది. ఆయన స్థానంలో నీరజ్ చోప్రాకు టోక్యో ఒలింపిక్స్లో బయోమెకానికల్ నిపుణుడిగా సేవలందించిన క్లాస్ బార్టోనియెట్జ్ను నియమించారు. మరో ఇద్దరు కోచ్లను తీసుకురావడంపై కూడా ఏఎఫ్ఐ చర్చించింది. ఈ విషయాలను ఏఎఫ్ఐ అధ్యక్షుడు అడిల్లే సుమారివల్లా వెల్లడించారు.
నీరజ్ చోప్రాకు కోచింగ్ ఇచ్చేందుకు భారత అథ్లెటిక్స్ సమాఖ్య ఉవే హూన్ (59) ను 2017 లో నియమించింది. 2018 ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్లో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్స్ సాధించడంలో ఉవే హూన్ పాత్ర ఎంతో ఉన్నది. అనంతరం టోక్యో ఒలింపిక్స్కు వెళ్లే జట్టు కోసం జాతీయ జావెలిన్ కోచ్గా ఉవే హూన్ను కొనసాగించారు. అయితే, హూన్ దగ్గర శిక్షణ పొందిన నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించగా.. మరో ఇద్దరు శివపాల్ సింగ్, అన్నూ రాణిలు ఉత్త చేతులతో తిరిగొచ్చారు. ఇలాఉండగా, సోమవారం నాటి సమీక్ష సమావేశంలో ఉవే హూన్ కింద శిక్షణ పొందేందుకు నీరజ్ చోప్రాతో పాటు శివపాల్ సింగ్, అన్నూ రాణిలు విముఖత చూపారని ఏఎఫ్ఐ ప్లానింగ్ మిషన్ చీఫ్ లలిత్ కే భానోత్ తెలిపారు. జావెలిన్కు మరో ఇద్దరు కోచ్లు అవసరమని, మంచి కోచ్ను తీసుకురావడం కష్టమైనప్పటికీ కనీసం ఒక్కరినైనా నియమించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. శివపాల్ సింగ్, అన్నూ రాణిలు ఉవే హూన్ వద్ద శిక్షణ తీసుకోవడం వల్లనే వారు విజయం సాధించలేకపోయారని, క్లాస్ బార్టోనియెట్జ్ వద్ద తర్ఫీదు పొందిన నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించాడని ఆయన వెల్లడించారు.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారితో పనిచేయడం చాలా కష్టం అని ఉవే హూన్ గత జూన్లో వ్యాఖ్యానించారు. అలాగే, ఒలింపిక్స్ ఏర్పాట్లపై తీవ్రంగా విమర్శలు చేశారు. ‘భారత్లో జావెలిన్ త్రోలో ఏదో మంచి చేయాలన్న ఆలోచనతో ఇక్కడికి వచ్చాను. అయితే, సాయ్, ఏఎఫ్ఐతో కలిసి పనిచేయడం ఇబ్బందికరంగా ఉన్నది. ఇది వారి జ్ఞానమా లేక అజ్ఞానమా అనేది నాకు తెలియదు. అథ్లెట్ల కోసం సప్లిమెంట్ల కోసం న్యూట్రిషనిస్ట్ అడిగినా పట్టించుకోలేదు. క్రీడా మంత్రిత్వ శాఖ ఎంపిక చేసిన టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీం అథ్లెట్లకు కూడా పోషకాలు అందేవి కాదు’ అని ఉవే హూన్ స్పష్టం చేశారు. ఏప్రిల్లో చేసిన కాంట్రాక్ట్ విషయంలో నేను సంతోషంగా లేనని, బలవంతంగా ఒప్పందంపై సంతకాలు చేయించారని ఆయన ఆరోపించారు.
బీఏలో ఆప్షనల్ సబ్జెక్ట్గా ‘రామ్చరిత్మానస్’.. ఎక్కడంటే?
‘నీట్’గా రూ.35 లక్షలకు పేపర్ అమ్మాడు.. ఎక్కడంటే..?
నీలి రంగు జెర్సీలోకి మారిన ఆర్సీబీ.. ఎందుకంటే?
అధికార భాషగా హిందీకి 72 ఏండ్లు
బర్రెపై ఎక్కి వచ్చి నామినేషన్ దాఖలు.. ఎక్కడంటే..?
యాంటీఆక్సిడెంట్ మందుతో గుండెపోటు నివారించొచ్చు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..