న్యూఢిల్లీ : యూపీలో తమ ఓటుబ్యాంక్ను సుస్ధిరం చేసుకునేందుకు ఓటర్ల మధ్య చిచ్చురేపడంలో బీజేపీ, ఎస్పీలు ఆరితేరాయని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆరోపించారు. విభజిత రాజకీయాలను ప్రోత్సహించే ఈ పార్టీలను పక్కనపెట్టి మతపరంగా, కులాల వారీగా ప్రజలను విభజించని మరో తరహా రాజకీయ పార్టీలను ప్రజలు ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపు ఇచ్చారు.
సాగు చట్టాలు, లఖింపూర్ ఖేరి ఘటనను ప్రస్తావిస్తూ రైతులపై ప్రభుత్వ అణిచివేత ప్రభావం పశ్చిమ యూపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. ఎన్నికల అనంతరం ఫలితాలకు అనుగుణంగా అవసరమైతే ఇతర పార్టీలతో పొత్తులపై పార్టీ ఓ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
40 శాతం పార్టీ టికెట్లను మహిళలకు కేటాయిస్తామని ప్రకటించి మహిళా సాధికారత ప్రధాన అజెండాగా తమ పార్టీ ఎన్నికలకు వెళుతోందని తెలిపారు. యాభై శాతం జనాభా కలిగిన మహిళలు రాజకీయ, ఎన్నికల శక్తిగా ఏకతాటిపైకి వస్తే దేశ రాజకీయాలను మార్చే సత్తా వారికి ఉందని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. ఇక ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.