లక్నో : ప్రజా సమస్యలకు సంబంధించి కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడాలని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. కాంగ్రెస్, ఎస్పీ ఉగ్రవాదుల పట్ల సానుభూతివైఖరి ప్రదర్శిస్తున్నాయన్న ప్రధాని ఆరోపణలపై ప్రియాంక స్పందించారు. మోదీ ఆరోపణలు అవాస్తవమని ఆయనకు కూడా తెలుసని అయితే ఎన్నికల్లో గట్టెక్కేందుకే ఆయన ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. యూపీలో పెద్దసంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు.
ప్రధాని ప్రజా సమస్యలపై నోరు మెదపాలని లక్నోలోని చిన్హత్ ప్రాంతంలో ప్రచార సభల్లో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ఇక నాలుగో దశ ఎన్నికలకు చివరిరోజు సోమవారం పలు పార్టీల నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. సీఎం యోగి ఆదిత్యానాధ్ రాయ్బరేలిలో బహిరంగ సభలో పాల్గొననుండగా ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ హర్దోయ్, రాయ్ బరేలి, సుల్తాన్పూర్, అమేథిల్లో ఎన్నికల ప్రచారం చేపడతారు. ఇక యూపీలో మిగిలిన దశల ఎన్నికలకు ఎస్పీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో అఖిలేష్ యాదవ్ బాబాయి శివపాల్ యాదవ్ పేరు చేర్చారు.
ఎస్పీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, డింపుల్ యాదవ్ తదితరులున్నారు. కాగా ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి పలితాలు ప్రకటిస్తారు. ఇక యూపీ ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి పాలనా పగ్గాలు చేపట్టాలని పాలక బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతుండగా, యోగి సర్కార్పై వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అందలం ఎక్కాలని అఖిలేష్ యాదవ్ సారధ్యంలోని ఎస్పీ చెమటోడుస్తొంది. మరోవైపు ప్రధాన పార్టీలకు దీటైన పోటీ ఇచ్చేందుకు బీఎస్పీ, కాంగ్రెస్ తమదైన వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.