బెంగళూర్ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు (Karnataka Assembly Elections) రేపటితో ప్రచార పర్వం ముగియనుండటంతో ప్రధాన పార్టీల అగ్రనేతలు సుడిగాలి పర్యటనలతో రాష్ట్రాన్ని చుట్టేస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ముడిబిద్రిలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో కాషాయ పార్టీ లక్ష్యంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు.
కర్నాటకలో హింస ప్రజ్వరిల్లితే అది రాష్ట్రంలో 40 శాతం కమిషన్ సర్కార్ చలువేనని ఆమె ఆరోపించారు. మోదీజీ..కర్నాటకలో అలజడి రేగితే అది మీ సర్కార్ హయాంలో తాండవించిన నిరుద్యోగం నిర్వాకంతోనేనని దుయ్యబట్టారు. గతంలో కార్పొరేషన్ బ్యాంక్, విజయా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్ వంటి నాలుగు వేర్వేరు బ్యాంకులు ఉండేవని, మోదీ సర్కార్ ఈ బ్యాంకులన్నింటినీ ఒకే బ్యాంకులో విలీనం చేసిందని అన్నారు.
కర్నాటకలో ప్రజలు మార్పు కోరుతున్నారని, కాంగ్రెస్ సర్కార్ కర్నాటకలో కొలువు తీరనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి సత్తా చాటాలని బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి, ఇక మే 10న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Read More
Watch: కాలువలో కరెన్సీ నోట్ల కట్టలు.. వాటి కోసం పోటీ పడిన స్థానికులు