పాట్నా: ఒక మురికి కాలువలో కరెన్సీ నోట్ల కట్టలు (Currency Notes in Drain) కనిపించాయి . దీంతో వాటిని దక్కించుకునేందుకు స్థానికులు పోటీ పడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీహార్లోని రోహ్తాస్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం ఉదయం మొరాదాబాద్ గ్రామంలోని ఒక వంతెన కింద ఉన్న మురికి కాలువలో డబ్బుల కట్టలున్న సంచులను స్థానికులు గమనించారు. వారు ఆ కాలువలోకి దిగి వాటిని తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన మరి కొందరు స్థానికులు పెద్ద సంఖ్యలో ఆ కాలువ వద్దకు వచ్చారు. వారంతా ఆ కాలువలోకి దిగి సంచుల్లో ఉన్న రూ.2,000, రూ.500, రూ.100, రూ.10 విలువైన కరెన్సీ నోట్ల కట్టలను సేకరించేందుకు పోటీ పడ్డారు. ఆ డబ్బుల కట్టలన్నీ నిజమైన నోట్లేనని వాటిని దక్కించుకున్న వారు తెలిపారు.
కాగా, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఈ విషయం జిల్లా అధికారుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో దీనిపై దర్యాప్తు చేస్తామని అధికారులు తెలిపారు. అవి అసలు కరెన్సీ నోట్లేనా?, ఆ మురికి కాలువలో ఎవరు పడేశారు? అన్నది తెలుసుకుంటామని చెప్పారు.
మరోవైపు వైరల్ అయిన ఈ వీడియో క్లిప్పై నెటిజన్లు భిన్నంగా, ఫన్నీగా స్పందించారు. మురికి కాలువలో క్లీనింగ్ ఆపరేషన్ అని ఒకరు, డబ్బుల కోసం జనం ఏదైనా చేస్తారని మరొకరు పేర్కొన్నారు. ప్రజల డబ్బులు తిరిగి వారికి చేరాయని ఒకరు వ్యాఖ్యానించారు. అవి నకిలీ కరెన్సీ కావచ్చని కొందరు, అవినీతి ఆరోపణలున్న బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ వర్గానికి చెందినవి కావచ్చని మరికొందరు అభిప్రాయపడ్డారు. బీహార్లో ఇప్పుడు ఎన్నికలు లేవుగా? ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అని ఒకరు ప్రశ్నించారు.
If it is money, people will do anything. They waded sewage water in a canal in #Sasaram town in #Rohtas district of #Bihar to collect bundles of sodden, rotten currency notes. #India #Rupees #MoneyHeist pic.twitter.com/0NCCCHKf7u
— Dev Raj (@JournoDevRaj) May 6, 2023