లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజులే మిగిలిఉండటంతో కాంగ్రెస్ పార్టీ ప్రచార పర్వాన్ని హోరెత్తించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ శుక్రవారం ఘజియాబాద్లోని సహిబాబాద్లో ర్యాలీ నిర్వహించారు. ఈ నియోజకవర్గం నుంచి 2020 ఆగస్ట్లో గుండెపోటుతో మరణించిన కాంగ్రెస్ నేత రాజీవ్ త్యాగి భార్య సంగీత త్యాగిని కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో నిలిపింది. ర్యాలీని ఉద్దేశించి ప్రియాంక గాంధీ మాట్లాడుతూ 30 ఏండ్లలో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ యూపీలోని 403 స్ధానాల్లో పోటీ చేస్తోందని చెప్పారు. ప్రజలను వేధిస్తున్న కీలకాంశాలనే తమ పార్టీ ప్రధాన అజెండాగా ముందుకొస్తోందని అన్నారు. అంతకుముందు ప్రియాంక గాంధీ ఘజియాబాద్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ మేనల్లుడు భూపీందర్ సింగ్ హనీని ఇసుక మైనింగ్ కేసులో మోదీ సర్కార్ అరెస్ట్ చేయడాన్ని ఆమె ప్రస్తావిస్తూ మోదీ ప్రభుత్వం ప్రత్యర్ధులపై రాజకీయంగా ప్రతీకారం తీర్చుకుంటోందని ఆరోపించారు. విపక్ష నేతలను ఒత్తిడికి లోను చేసేందుకు వారిపై కేంద్ర ఏజెన్సీలను ఉసిగొల్పుతోందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇలాంటి రాజకీయాలను అనుమతించరాదని అన్నారు. యువత, మహిళలే లక్ష్యంగా యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తనదైన వ్యూహాలకు కాంగ్రెస్ పదునుపెడుతోంది. యువత కోసం ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటించిన కాంగ్రెస్ పెద్దసంఖ్యలో మహిళలకు పార్టీ టికెట్లు కేటాయించింది.
యూపీలో అధికారంలోకి వస్తే యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీలు గుప్పించింది. ఇక యూపీలో ఫిబ్రవరి పది నుంచి మార్చి ఏడు వరకూ ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో గెలుపొంది తిరిగి అధికారం నిలుపుకోవాలని యోగి ఆదిత్యానాధ్ సారధ్యంలోని పాలక బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. యోగి సర్కార్పై అసంతృప్తిని సొమ్ము చేసుకుని అందలం ఎక్కాలని ఎస్పీ చెమటోడుస్తోంది. ఇక ప్రియాంక ఇమేజ్తో బయటపడాలని కాంగ్రెస్ పోరాడుతుండగా, సంప్రదాయ ఓటు బ్యాంకుతో సత్తా చాటాలని మాయావతి సారధ్యంలోని బీఎస్పీ పావులుకదుపుతోంది.