డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో నేతలు రాజకీయ ప్రత్యర్ధులపై మాటల తూటాలు పేల్చుతున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగానికి కాషాయ సర్కార్ విధానాలే కారణమని ఆమె మండిపడ్డారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల మన్ కీ బాత్ను వినడం లేదని ఆరోపించారు. ఉద్యోగాల కోసం ఉత్తరాఖండ్ ప్రజలు ఇతర రాష్ట్రాలకు ఎందుకు వలసబాట పడుతున్నారని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.
ఉత్తరాఖండ్లో ప్రజలు పాలక బీజేపీ విధానాలతో విసిగిపోయారని, పర్వత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనా పగ్గాలు చేపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ధరల మంటను అరికట్టి ఉపాధి కల్పించేందుకు ఏం చర్యలు చేపడుతున్నారో సీఎం పుష్కర్ సింగ్ ధామి వివరించాలని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. మహిళల బాగు కోసం ఏం చేయబోతున్నారో సీఎం వెల్లడించాలని కోరారు. ఫిబ్రవరి 14న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
ఇక ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలుపొంది అధికార పగ్గాలు చేపట్టాలని పాలక బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుండగా, ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ముచేసుకుని అందలం ఎక్కాలని విపక్ష కాంగ్రెస్ చెమటోడుస్తోంది. పర్వత రాష్ట్రంలో ఎలాగైనా సత్తా చాటాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సన్నద్ధమవుతోంది.